Thursday, June 5, 2025
E-PAPER
Homeరాష్ట్రీయం10 నుంచి అందుబాటులో ప్రజాప్రతినిధులు

10 నుంచి అందుబాటులో ప్రజాప్రతినిధులు

- Advertisement -

టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

ఈనెల 10 నుంచి ప్రజాప్రతినిధులు గాంధీభవన్‌లో అందుబాటులో ఉంటారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ప్రతి రోజూ ఇద్దరు ప్రజాప్రతినిధులు, ఇద్దరు కార్పొరేషన్‌ చైర్మెన్లు ప్రజల సమస్యల నుంచి విజ్ఞప్తులు తీసుకుంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆ తర్వాత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారని తెలిపారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళతాం :
కార్పొరేషన్‌ చైర్మెన్ల సన్నాహక సమావేశంలో నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వివిధ కార్పొరేషన్‌ చైర్మెన్లు నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లో అన్ని కార్పొరేషన్ల చైర్మెన్లు సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ ఆదేశాలమేరకు కార్పొరేషన్‌ చైర్మెన్లు సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు, పార్టీ బలోపేతం, కమ్యూనికేషన్‌ వ్యూహాలపై చర్చించారు. పార్టీ నైతిక విలువలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు తాము కట్టుబడినట్టు ప్రకటించారు. ప్రతిరోజు ఇద్దరు కార్పొరేషన్‌ చైర్మెన్లకు గాంధీభవన్‌ మీడియాతో మాట్లాడే అవకాశం ఇవ్వాలని తీర్మానించారు. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండాలనీ, ప్రతిపక్షాల విమర్శలను సమర్ధంగా తిప్పికొట్టాలని నిర్ణయించారు. నియోజకవర్గాల వారీగా చైర్మెన్లకు ప్రోటోకాల్‌ అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పార్టీకి, ప్రభుత్వానికి అంకితభావంతో పని చేస్తామని చైర్మెన్లు వివరించారు.
కాగ్‌ ప్రశ్నలకు ప్రవీణ్‌ కుమార్‌ సమాధానం చెప్పాలి :
టీపీసీసీ మీడియా కమిటీ చైర్మెన్‌ రామ్మోహన్‌రెడ్డి
బీఆర్‌ఎస్‌ నేత ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గురుకులాల కార్యదర్శిగా ఉన్న సమయంలో జరిగిన అవినీతిపై కాగ్‌ ఆయనకు కొన్ని ప్రశ్నలు సంధించిందని, వాటిని ఆయన సమాధానం చెప్పాలని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మెన్‌ సామ రామ్మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.
మంగళవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. తమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దళిత విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలను ఆయన లూటీ చేశారని ఆరోపించారు. బీఆర్‌ అంబేద్కర్‌ పేరు చెప్పి ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలో కేంద్రం పొందుపరిచిన అంశాలనే తాము బయట పెడుతున్నామన్నారు. కోడింగ్‌ విధానంపై ఏడాదికి రూ.4 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. 240 మంది పిల్లలకు కోడింగ్‌ నేర్పిస్తే, రూ.4 కోట్లు అవుతాయా? అని సందేహం వ్యక్తం చేశారు. మూడు సంస్థల పేరుతో కోడింగ్‌ నేర్పిస్తానంటూ రెండు సంస్థలకు సంబంధించి సమాచారం తీసుకున్నారని గుర్తు చేశారు. ఈ-టెండర్‌ ప్రక్రియ సైతం ఆయన లెక్క చేయ లేదని విమర్శించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -