– జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు
నవతెలంగాణ – జుక్కల్
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలం వల్ల రాచరికపు పాలన నుంచి విముక్తి పొందినామని అన్నారు. భారత యూనియన్లో తెలంగాణ విలీనమైన శుభదినాన్ని “ప్రజా పాలన దినోత్సవం” నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష, వారి ఆలోచన అని అన్నారు. ఇది నాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి అని పేర్కొన్నారు. తెలంగాణ అంటే త్యాగం, ఆనాటి సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.