– ఈనెల 6 నుంచి జూన్ 12 వరకు నిర్వహణ
– గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అమలు
– పౌర సేవలను సులభతరం చేసేలా సంస్కరణలు
– సీనియర్ ఐఏఎస్ జయేశ్ రంజన్ అధ్యర్యంలో కమిటీ
– ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ అనే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి ప్రకటించారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రణాళికను అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల పండుగైన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని జూన్ 2న సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకను పురష్కరించుకుని ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని, అందుకవసరమైన ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి ఆచరణలో పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయాలని సీఎస్ రామకృష్ణారావును కోరారు. ఫైళ్ల క్లియరెన్స్తోపాటు ఆఫీసుల్లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎస్ రామకష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డితోపాటు ముఖ్యమంత్రి సలహాదారు వేంనరేందర్రెడ్డి, సీఎంవో అధికారులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరిపాలనలో అధునాతన సాంకేతిక నైపుణ్యాన్ని సమర్థంగా వినియోగించాలని ఈ సందర్భంగా సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, పౌర సేవలన్నింటినీ మరింత సులభతరం చేయాలని చెప్పారు. పాలనలో భాగంగా ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందనే విషయాన్ని దరఖాస్తుదారుడు సులభంగా తెలుసుకునే విధంగా ఒక విధానాన్ని రూపొందించాలని ఆయన సూచించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలను అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడు వారాల్లో కమిటీ తమ నివేదికను అందజేయాలని చెప్పారు. ప్రతి విభాగమూ ఈ-ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ను అమలు చేయాలని అన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను రాబోయే 20 సంవత్సరాలకు సరిపడేలా అప్ డేట్ చేసుకోవాలని ఆదేశించారు. హైదరాబాద్లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తోపాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయనీ, ఇవన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు మార్పును స్వాగతిస్తున్నారనీ, అందుకే వరుస ఎన్నికల్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా విధినిర్వహణలో పునరంకితం కావాలని చెప్పారు.
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



