Wednesday, June 18, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిప్రజా పాత్రికేయుడు... కామ్రేడ్‌ ఎంహెచ్‌

ప్రజా పాత్రికేయుడు… కామ్రేడ్‌ ఎంహెచ్‌

- Advertisement -

కామ్రేడ్‌ మోటూరు హనుమంతరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. జాతీయోద్యమ కాలంలో విద్యార్థి రంగంలో ఉద్యమం జీవితం ప్రారంభించి, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా పీడిత ప్రజల కోసం ఆరు దశాబ్దాలపాటు చివరి శ్వాస వరకు కృషి చేశారు. మార్క్సిస్టు పార్టీ కార్యదర్శిగా పద్దెనిమిదేండ్ల పాటు బాధ్యతలు నిర్వహించారు. శాసన సభ్యుడిగా (1952-54) శాసన మండలి సభ్యుడిగా (1978-1984), రాజ్యసభ సభ్యునిగా (1988-1994) పీడిత ప్రజల తరపున తన గళాన్ని వినిపించారు. సిద్ధాంతకర్తగా, గొప్ప వక్తగా విప్లవోద్యమానికి ఎనలేని సేవలందిం చారు. నిరాడంబరంగా, నిగర్విగా స్నేహశీలిగా అందరి గౌరవాన్ని పొందారు. తన ఉద్యమ జీవితంలో మూడుసార్లు నాలుగున్నరేండ్ల పాటు నిర్బంధించబడ్డా, ఐదున్నరేండ్లపాటు అజ్ఞాతానికి వెళ్లాల్సి వచ్చినా, కమ్యూనిస్టు పార్టీలో సైద్ధాంతిక విబేధాలతో ఒడిదుడుకులు వచ్చినా ధైర్యంగా ఎదురొడ్డి ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ముందు పీఠిన ఉన్నారు.
అయితే కామ్రేడ్‌ హనుమంతరావు జీవితంలో అన్నింటికన్నా విశిష్టమైనది ప్రజా పాత్రికేయునిగా ఆయన నిర్వహించిన బాధ్యత. హనుమంతరావు గారి పాత్రికేయ జీవితం స్వాతంత్య్రానంతరం యాభయ్యవ దశకంలో ప్రారంభమై తొంభయ్యవ దశకంలో ముగిసింది. ఈ కాలంలో మీడియా రంగంలో ప్రింట్‌ మీడియా ప్రధాన పాత్ర నిర్వహించింది. ప్రజలకు సమాచారాన్ని ఇవ్వడం రాజకీయ విశ్లేషణలు అందించడం ప్రధానంగా పత్రికల ద్వారానే జరిగింది. కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక అయిన విశాలాంధ్రకు ఆయన ఎనిమిది సంవత్సరాలు సంపాదకునిగా జేశారు. మార్క్సిస్టు పార్టీ ఆవిర్భవించిన తర్వాత వారి సంపాదకత్వంలోనే ప్రజాశక్తి వారపత్రిక ప్రారంభమైంది. ఆయన సారథ్యం లోనే 1981లో ప్రజాశక్తి దినపత్రిక అయింది.ఆయన రచనల్లో సూటిదనం, కరుకుదనం, గంభీరత, విశ్లేషణ, వాదనా పటిమ ఉట్టిపడతాయి. జై తెలంగాణ, జై ఆంధ్ర విచ్ఛిన్న ఉద్యమాలు రాష్ట్రంలో తలెత్తినప్పుడు ఏటికి ఎదురీదుతున్నట్లు పరిస్థితులున్నా తెలుగు ప్రజల సమైక్యతను సమర్థిస్తూ ఆయనజేసిన రచనలు సమైక్యవాదులకు దిక్సూచిగా నిల్చాయి. ఆయన రాసిన ‘విశాలాంధ్రలో విషాదఛాయలు’ అన్న చిన్నపుస్తకాన్ని ఇప్పటికీ మనం మర్చిపోలేం.
కామ్రేడ్‌ మోటూరు వర్ధంతి సందర్భంగా మీడియా రంగంలో వచ్చిన మార్పులు గురించి ప్రస్తావిం చుకోవడం సబబుగా ఉంటుంది. జాతీయోద్యమ కాలంలో వలస పాలనకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించడంలో పత్రికలు గొప్ప పాత్రను నిర్వహించాయి. ఆ కాలంలో కమ్యూనిస్టులు నిర్బంధాలను, అణచివేతలను ఎదుర్కొని అనేక పత్రికలను ప్రచురించారు. ప్రజలను చైతన్య వంతులను చేయడంలో, వాస్తవాలను ప్రజలకు చేర్చడంలో దోపిడీని, దుర్మార్గాలను వెల్లడించడంలో అబద్ధాలను, మభ్యపెట్ట డాన్ని బట్టబయలు చేయడంలో ఉద్యమకారులకు పత్రికలు, సభలే ఆనాడు ప్రధానమైన సాధనాల య్యాయి. స్వాతంత్య్రం అనంతరం కొన్ని పత్రికల స్వభావం మారినా, కమ్యూనిస్టు పత్రికలు ప్రజల తరపున ఉద్యమ పత్రికలుగానే కొనసాగాయి. దోపిడీ, అణచివేతలు కొనసాగినంత కాలం ప్రజా పత్రికలు ఈ పాత్రను నిర్వహిం చక తప్పదు. ఈ కాలంలో తెలుగు ప్రజల కోసం కమ్యూనిస్టు పార్టీ ‘విశాలాంధ్ర’ను ప్రారంభించింది. విశాలాంధ్ర పేరులోనే వుంది, అది ఉద్యమ పత్రికని. జతీయోద్యమ కాలంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు ను ప్రతిపాదించిన కాంగ్రెస్‌, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాట మార్చడంతో దేశవ్యాపితంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకోసం ఉద్యమాలు ప్రారంభమ య్యాయి. ఈ ఉద్యమాలలో కమ్యూని స్టులు ముందుపీఠిన ఉన్నారు. ఆంధ్ర ప్రాంతంలో కమ్యూనిస్టులు ఉద్యమ లక్ష్యాన్ని వ్యక్తం చేసే ‘విశాలాంధ్ర’ పేరును తమ అధికార పత్రికకు పెట్టుకున్నారు. ఈ ఉద్యమ నేపథ్యంలోనే సుందరయ్య గారు విశాలాంధ్రలో ప్రజారాజ్యం అన్న పుస్తకాన్ని రాశారు.
వాస్తవాలు తెలసుకోవాలంటే కమ్యూనిస్టు పత్రికలు చదవాలన్న భావం ప్రజల్లో ఉండేది. ఉద్యమ లక్ష్యం, ప్రజల ప్రయోజనం దిక్సూచిగా ఉండే ఏ పత్రికకైనా సత్య సంధత ఉంటుంది. నిజం, నిర్భయత్వం ఉంటుంది. అందుకే హంగులు, ఆర్భాటాలు లేకపోయినా కమ్యూనిస్టు పార్టీల పత్రికలు ఆనాడు ప్రజల నమ్మకాన్ని చూర గొన్నాయి.స్వచ్ఛంద శ్రమతో ప్రజల సహాయంతో విశాలాంధ్ర, ప్రజాశక్తి వంటి పత్రికలు నడిచేవి. ఆధునిక మార్పు లకు అవసరమైన పెట్టుబడి ఖర్చు పెరిగిపోతూ ఉంటే ఈ పత్రికలకు ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా ఉద్యమ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాయి.1990 దశకం వరకు పత్రికారంగమే ప్రధానంగా మీడియా రంగంగా ఉండేది. సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో, వినోదాన్ని అందించడంలో ఆలిండియా రేడియో 1937 నుండి ఉనికిలో ఉన్నా టెలివిజన్‌ 1957లో విద్యా కార్యక్రమాల కోసం ప్రారంభమైనా పూర్తిస్థాయి కార్యక్రమాల కోసం అది 1976లో దూరదర్శన్‌ అవతారం ఎత్తినా, పత్రికలే ప్రధాన సమాచార సాధనాలుగా కొనసాగాయి.కానీ ఆ తర్వాత సరళీకరణ, ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ విధానాలు ప్రారంభమవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారి పోయింది. శాస్త్రసాంకేతిక రంగాల్లో వచ్చిన గుణాత్మకమైన మార్పులలో పత్రికా రంగానికి సమాంత రంగా టెలివిజన్‌, రేడియోలు విస్తరించాయి. ఇంటర్‌నెట్‌, బ్రాడ్‌బ్యాండ్‌, శాటిలైట్‌ వినియోగం, డెస్క్‌టాప్‌, కంప్యూటర్లు, వరల్డ్‌ వైడ్‌ వెబ్‌, సెల్‌ఫోన్‌, స్మార్ట్‌ఫోన్లు వ్యాపించాయి.
కొన్ని గణాంకాలను పరిశీలిస్తే ఎంత మార్పు వచ్చిందో తెలుసుకోవచ్చు. ఇప్పటికీ మన దేశంలో వార్తా పత్రికల సర్క్యులేషన్‌ స్థిరంగా కొనసాగుతున్నా ఇతర మీడియా రూపాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. 2009 నాటికి ఇంటర్‌నెట్‌ వినియోగ దారులు 8కోట్ల పదిలక్షల మంది ఉన్నారు. 2010 నాటికి బ్రాడ్‌బాండ్‌ వినియోగించే వారు 75 లక్షల 70వేలకు చేరుకుంది. 2009లో టెలివిజన్‌ ప్రసార కేంద్రాలు 1400 ఉన్నాయి. 2024లో పత్రి కల సర్క్యులేషన్‌ 2కోట్ల 32లక్షల మొబైల్‌ ఫోన్‌ వినియోగదార్ల సంఖ్య 116.3 కోట్లకు పెరిగింది. దేశంలో మొబైల్‌ ఫోన్‌ సర్వీసు 1995లో ప్రారంభమైంది. ఆ సంవత్సరం జులై 31న మొట్ట మొదటి కాల్‌ను కలకత్తా నుండి ఢిల్లీకి నాటి పశ్చిమ బెంగాల్‌ వామ పక్ష ప్రభుత్వ ముఖ్య మంత్రి జ్యోతిబసు చేశారు. ఒక సర్వే ప్రకారం 2025 మే నాటికి దేశంలో 85.5 శాతం కుటుంబాల లో కనీసం ఒక స్మార్ట్‌ఫోన్‌ అయినా ఉన్నది. 2024 ఆగష్టు నాటికి దేశంలో 112 కోట్ల సెల్యు లార్‌ కనెక్షన్లు ఉన్నాయి. అంటే 78 శాతం ప్రజలకు ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నదన్న మాట. ట్రారు ఇచ్చిన వివరాల ప్రకారం 2023లో 91 కోట్ల 81 లక్షల మంది అంటే 68 శాతం ప్రజలు అంతర్జాల సౌకర్యాన్ని కలిగిఉన్నారు. 2024లో 33 శాతం ప్రజలు అంటే 46 కోట్ల 70 లక్షల సోషల్‌ మీడియా అకౌంట్లు ఉన్నాయి.
సమాచార, ప్రసార సాధనాల్లో వచ్చిన ఈ పెను మార్పు మీడియాపై కూడా పడింది. సమాచారం కోసం ప్రజలు ఈ సాధానాలవైపు మొగ్గారు. క్రమేణా ఈ రంగాలన్నీ పెద్దపెద్ద కార్పొరేట్‌ సంస్థల్లోకి పోయి సమాచార ప్రసా రాలను ప్రజలకోసం కన్నా తమ వ్యాపార ప్రయోజనకం కోసం, తమకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తుల అవ సరాలకోసం వినియోగించడం మొదలైంది. సంపాదక నిబద్దతకు, స్వయం ప్రతిపత్తి విలువ తగ్గిపోయి, యాజమాన్య ప్రమేయంతో మీడియా నడిచే నూతన పరిస్థితి వచ్చాయి. పత్రికా, ప్రసార రంగాల్లో ప్రయివేటు పెట్టుబడి పెరిగింది. సమాచారాన్ని అందించడంలో పత్రికల పాత్ర తగ్గిపోతూ వస్తున్నది. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ (ఎక్స్‌), యూట్యూబ్‌, ఆన్‌లైన్‌ పోర్టళ్లు వంటి కొత్త మాధ్యమాలు వార్తలకు, సమాచారానికి ప్రధాన మార్గాలుగా మారాయి. ఈ మార్పులు విస్తారమైన ప్రజానీకానికి విస్తృతమైన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇంకొక రకంగా చెప్పాలంటే సమా చార విస్ఫోటనాన్ని ప్రజలు చూస్తున్నారు. ప్రజాజీవితంలోని అన్ని అంశాలను అర్థం చేసుకోవడానికి, అన్ని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశాలు విస్తృతమయ్యాయి.
అయితే అదే సమయంలో సమాజానికి, ప్రజల ప్రయోజనానికి హాని కలిగించే ధోరణులు కూడా పెరి గాయి. ఈ రోజు వార్తల కోసం సోషల్‌ మీడియా, ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టళ్లు, సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ (వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌, రీల్స్‌, పాడ్‌కాస్ట్స్‌ వగైరా)పై ప్రజలు ఆధారపడు తున్నారు.మీడియా ప్రపం చంపై కార్పొరేట్‌ పెట్టుబడిదార్ల పట్టు బిగిసిపోయింది. వారి ఆర్థిక ప్రయోజనాలు, వారి రాజకీయ మితృల ప్రయోజ నాలకు మీడియా పనిచేసే ధోరణి వ్యాపించింది.తమ అవసరాలను నెరవేర్చే మేరకు సమాచారాన్ని ఇవ్వడం, వక్రీకరించి, కొన్ని సందర్భాల్లో కల్పించి కూడా సమాచారాన్ని వ్యాపించడం ఆనవాయితీ అయ్యింది. ఇది సోషల్‌ మీడియాలో మరీ శృతి మించి పోయింది. ఫేక్‌ న్యూస్‌, వైషమ్యాలను రెచ్చగొట్టే, అసభ్యత, అశ్లీలతను ప్రోత్సహించే, ద్వేషపూరిత, కక్షపూరిత ట్రోలింగ్‌ చేయడాలు మీడియా గౌరవాన్ని, నిబద్ధతను, నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. అన్నింటి కన్నా సామాన్య ప్రజల ప్రయోజనాలు, ఆకాంక్షలు, అవసరాలు మీడియాలో పూర్తిగా మరుగున పడిపోతున్నాయి.
ఈ పరిస్థితిని మార్చాలి. ఇప్పుడు మన ముందున్నది మీడియాను ప్రజల బాట పట్టించడం ఎలా అనేది. ప్రజల పట్ల విశ్వాసం, లక్ష్యం పట్ల అంకిత భావం ఉన్న మీడియా అవసరం గతంకన్నా ఇప్పుడు ఎక్కువైంది. కార్పొరేట్‌ మీడియాకు ప్రత్యామ్నాయంగా నిలవగల్గే మీడియా బలపడాల్సిన అవసరం ఎప్పుడూ లేనంతగా పెరిగింది. సామాన్య ప్రజల ఆకాంక్షలను, అందులో అణచివేయ బడుతున్న తరగతుల ప్రయోజనాలను, ప్రజాస్వామ్యం, లౌకికతత్వం, మానవతా విలువల కోసం మీడియా నిలబడాలి. అటు డిజిటల్‌ మీడియాలోనూ, ఇటు పత్రికా రంగంలో అటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలు నెమ్మదిగానైనా వ్యాపిస్తున్నాయి. కానీ పాలకులు, బీజేపీ, సంఘపరివార్‌ శక్తులు ఈ స్వతంత్ర మీడియాను సహించలేకపోతున్నాయి. కార్పొరేట్‌ శక్తులు ఆర్థిక బలాన్ని, రాజ్యపు అధికారాన్ని ఉపయోగించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి. 1975 నాటి ఎమర్జెన్సీ కాలంలో ఆనాటి ప్రభుత్వం మీడియా స్వేచ్ఛపై దాడిచేసింది. ఆనాడు హనుమంతరావు లాంటి పాత్రికేయులు ఎదురుతిరిగి నిరసన వ్యక్తం చేశారు. ప్రతిఘటించారు. ఈ రోజు మతోన్మాద నిరంకుశ బీజేపీ ప్రభుత్వం, సంఘపరివార్‌ ఫాసిస్టు శక్తులు పాత్రికేయులను వేధిస్తున్నాయి, తప్పుడు కేసులు పెడుతున్నాయి. జైలుపాలు చేస్తున్నాయి. ఈ నిర్బంధాలను ప్రతిఘటించి స్వతంత్ర, ప్రత్యామ్నాయ మీడియాను రక్షించుకోవాలి.
హనుమంతరావు గారి తరం ప్రజా మీడియాను, ప్రత్యామ్నాయ మీడియాను ఎలా ముందుకు తీసుకు పోయిందో నేడు మీడియా రంగంలో అటువంటి ప్రయత్నం చేస్తున్న శక్తులను బలపర్చుకోవాల్సి ఉంది.
నేడు ఎం.హెచ్‌. వర్ధంతి

బి.వి. రాఘవులు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -