నవతెలంగాణ – తుంగతుర్తి
తుంగతుర్తి ప్రాంత ప్రజల ముద్దుబిడ్డ, పోరాట యోధుడు, భవిష్యత్ తరాలకు స్ఫూర్తి ప్రధాత, వెంపటి గ్రామ ప్రజల ఆరాధ్య దైవం దాయం విక్రం రెడ్డి అని, దాయం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాయం ఝాన్సీ రాజిరెడ్డి అన్నారు. శుక్రవారం వెంపటి గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ శనివారం మండల పరిధిలోని వెంపటి గ్రామంలో ఏర్పాటు చేయనున్న దాయం విక్రం రెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
జననం: దాయం విక్రం రెడ్డి విప్లవ పోరాటాల పురిటి గడ్డ వెంపటి గ్రామంలో1953వ సంవత్సరంలో దాయం రాజిరెడ్డి శశిరేఖమ్మ దంపతులకు జన్మించారు. కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యంలో పెరిగిన విక్రం రెడ్డి వారి స్ఫూర్తితో 1970 లో పిడిఎస్యులో చేరి రైతు కూలీ సంఘాలను ఏర్పాటు చేశారు.
రాజకీయ జీవితం: 1981వ సంవత్సరంలో తండ్రి ఆదేశానుసారం సిపిఐలో చేరి వెంపటి గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. అనంతరం టిడిపి నుండి 1988లో ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నికయ్యారు. 2001వ సంవత్సరంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతులకు విశేష సేవలు అందించారని వారి సేవలను కొనియాడారు.
వ్యక్తిత్వం: దాయం విక్రం రెడ్డి మహోన్నతమైన వ్యక్తిత్వం, నమ్మిన సిద్ధాంతానికి, నైతిక విలువలకు, ఆదర్శాలకు, క్రమశిక్షణకు, ఆదర్శంగా నిలిచారని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు శ్రమించిన ప్రజా నాయకుడు దాయం విక్రం రెడ్డి వారి ఆశయాల సాధన కోసం వారి దారిలో నడవడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
గ్రామంలో మహనీయుల విగ్రహావిష్కరణ కార్యక్రమాలు గ్రామంలోని ప్రజల ఐక్యతకు, స్ఫూర్తికి, ప్రతీకగా నిలుస్తాయని అన్నారు. గ్రామాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషిచేసిన నాయకులను స్మరించుకోవడం, భావితరాలకు వారి ఆశయాలను, త్యాగాలను తెలియజేయడం మన కర్తవ్యం అన్నారు. పార్టీలకు వర్గాలకు అతీతంగా గ్రామమంతా ఏకమై నిర్వహించే, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారి కుటుంబ సభ్యులు కోరారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు, సీపీఐఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి,వారి కుటుంబ సభ్యులు అభిమానులు ప్రజాసంఘాల నాయకులు తదితరులు హాజరు కానున్నట్లు తెలిపారు.



