– ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రతీ ప్రజాప్రతినిధి తన పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ, బాధ్యతా యుతంగా సేవలు అందించాలి, జవాబుదారీతనం, పారదర్శకత పాటించాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు. నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని రైతు వేదిక లో బుధవారం ఏర్పాటు చేసిన రెండో విడత వార్డు సభ్యులు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామపంచాయతీ వ్యవస్థ గ్రామ అభివృద్ధికి కీలకం అని,మౌళిక వసతులు ప్రాథమిక అంశాల్లో వార్డు సభ్యుల పాత్ర ప్రాముఖ్యత ను వివరించారు.ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రతి ప్రజాప్రతినిధి ధర్మమని,ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేస్తేనే గ్రామాలు సమగ్ర అభివృద్ధి సాధిస్తాయని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే గ్రామాల్లో పటిష్టమైన నాయకత్వం అవసరమన్నారు.గ్రామాల్లో ఎదురయ్యే సమస్యలను సమన్వయంతో పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ(బీఎఫ్ఏసీ )చైర్మన్ సుంకవల్లి వీరభద్ర,ఎంపీడీవో అప్పారావు, ఎంపీఓ రామ కోటారెడ్డి,గ్రామపంచాయతీ కార్యదర్శులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




