– నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ స్కీమ్ను రద్దు చేయాలి: బీడీఎల్ వద్ద నిరసనలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ పథకాన్ని రద్దు చేయాలనీ, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్ డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరుతూ మంగళవారం హైదరాబాద్లోని బీడీఎల్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నదనీ, సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ గుత్త సంస్థలకు, పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించి దేశ ఆర్ధిక వ్యవస్థను లూటీ చేస్తున్నదని విమర్శించారు. బీడీఎల్ పరిశ్రమలో ఔట్సోర్సింగ్ విధానాన్ని పెంచుతుందన్నారు. రైల్వే, రోడ్, ఎయిర్వేస్, డాక్-పోర్టులు, టెలికం తదితర మౌలిక రంగాలలో ‘నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్’, ‘నేషనల్ ఎస్సెట్ మానిటైజేషన్ పైప్ లైన్’ పేరుతో లక్షల ఎకరాల భూములను కార్పొరేట్ కంపెనీలకు మోడీ సర్కారు కారుచౌకగా కట్టబెడుతున్న తీరును ఎండగట్టారు. బీడీఎల్ అధ్యక్షులు మురళి, ప్రధాన కార్యదర్శి టి.సత్తయ్య, కార్యనిర్వాహక అధ్యక్షులు దానకర్ణాచారి మాట్లాడుతూ.. దేశంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులరీత్యా సోమవారం తలపెట్టిన సమ్మె జూలై 9కి వాయిదా పడిందని తెలిపారు. రాబోయే 2 నెలల్లో మోడీ సర్కార్ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ పబ్లిక్ సెక్టార్ కార్మికులు ప్రచార కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని చైతన్యవంతం చేయాలని కోరారు.
ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES