నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం ఆయన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, మాట్లాడారు. భువనగిరి మండలంలోని చీమల కొండూరు గ్రామంలో గణిత ఉపాధ్యాయిని కేటాయించాలని కోరుతూ నల్ల మాస బాలరాజు కోరారు. పోచంపల్లి మండల కేంద్రంలోని
పగడాల ప్రమీల చేనేత కార్మికులకు సంబంధించి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో మసీదు స్థలం మాత్రమిచ్చుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముస్లింలు వినతిపత్రం అందజేశారు. బీబీనగర్ మండల కేంద్రంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని గ్రామస్తులు వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల ప్రజల నుండి 36 అర్జీలను, జిల్లా కలెక్టర్,జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి తో కలసి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. స్టేట్ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 23,జిల్లా పంచాయతీ 4, జిల్లా శిశు సంక్షేమ శాఖ 4, మున్సిపాలిటీ, విద్యా,డి ఆర్ డి ఓ,లీడ్ బ్యాంక్, ఎంప్లాయిమెంట్ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ శోభా రాణి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి,హౌసింగ్ పి.డి విజయసింగ్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.