నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరతగతిన పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కరరావు తో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి 35 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.
అందులో రెవిన్యూ శాఖ 22, సివిల్ సప్లై 6, గ్రామీణ అభివృద్ధి శాఖ 2, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 2, సర్వే ల్యాండ్స్ , వ్యవసాయ, మున్సిపాలిటీ శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ జయమ్మ, జడ్పీ సీఈవో శోభారాణి, ఆర్డీవో కృష్ణారెడ్డి,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.



