170 పేజీల నివేదిక అందజేసిన బింద్రా కమిటీ
న్యూఢిల్లీ : భారత స్పోర్ట్స్ పవర్గా ఎదిగేందుకు ప్రస్తుత క్రీడా పరిపాలన వ్యవస్థలో గుణాత్మక మార్పులు తీసుకురావాలని ఒలింపిక్ మెడలిస్ట్, దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా కమిటీ సూచించింది. భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు సుమారివాల, టాప్స్ మాజీ సీఈవో రాజేశ్ రాజగోపాలన్ సభ్యులుగా బింద్రా సారథ్యంలో ఈ ఏడాది ఆగస్టులో టాస్క్ఫోర్స్ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భారత క్రీడా రంగం పరిపాలన వ్యవస్థ, క్రీడా ప్రాధికార సంస్థ (శారు), రాష్ట్ర క్రీడా విభాగాలు సహా జాతీయ క్రీడా సమాఖ్యలు, అంతర్జాతీయ స్పోర్ట్స్ సంస్థలను అధ్యయనం చేసిన అనంతరం టాస్క్ఫోర్స్ కమిటీ 170 పేజీలతో కూడిన నివేదికను మంగళవారం న్యూఢిల్లీలో క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయకు అందజేసింది.
భారత క్రీడా ప్రాధికార సంస్థ (శారు) సహా జాతీయ క్రీడా సమాఖ్యలు (ఎన్ఎస్ఎఫ్), రాష్ట్ర క్రీడా విభాగాల్లో క్రీడా రంగంపై పట్టు, అనుభవం కలిగిన పరిపాలకుల కొరత ఉందని నివేదికలో స్పష్టం చేసింది. క్రీడలపై అవగాహన లేని అధికారులు, క్రీడాకారులు రిటైర్మెంట్ అనంతరం స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్లోకి అడుగుపెట్టేందుకు స్పష్టమైన మార్గం లేకపోవటం వంటి అంశాలను నివేదికలో పొందుపరిచారు. భారత్లో క్రీడా వ్యవస్థ, పరిపాలన పద్దతులను సమూలంగా మార్పు చేసేందుకు క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ (ఎన్సీఎస్ఈసీబీ) ఏర్పాటు చేయాలని టాస్క్ఫోర్స్ కమిటీ సిఫారసు చేసింది. అఖిల భారత సర్వీస్ అధికారులు సహా ఇతర స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్స్కు గుర్తింపు, నియంత్రణ, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేషన్ దృవీకరణలను ఎన్సీఎస్ఈసీబీ ద్వారా క్రీడామంత్రిత్వ శాఖ పర్యవేక్షించాలని నివేదికలో పొందుపరిచారు. టాస్క్ఫోర్స్ కమిటీ చేసిన సిఫారసులు అన్నింటికి అమలు చేస్తామని క్రీడాశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు.
క్రీడా పరిపాలనలో గుణాత్మక మార్పులు!
- Advertisement -
- Advertisement -



