నవతెలంగాణ – అశ్వారావుపేట : ప్రతి పంటలో నాణ్యమైన విత్తనం వాడినప్పుడు దిగుబడులు కనీసం 10 -15 శాతం వరకు పెంచుకోవచ్చు స్థానిక వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ జే.హేమంతకుమార్ అన్నారు. గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా సేకరించుకుని,సాగు చేసేటప్పుడు కొన్ని మెళకువలు పాటిస్తే, (ముఖ్యంగా వరి, పెసర, మినుము మరియు వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో) అదే విత్తనాన్ని కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు వాడుకోవచ్చు అని అన్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క పాత్రను గుర్తించి,ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం ‘నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం’ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది అని అన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో వ్యవసాయ పరిశోధన స్థానాల ద్వారా ఉత్పత్తి చేయబడిన నాణ్యమైన విత్తనాన్ని ఎంపిక చేయబడిన ముగ్గురు నుండి ఐదుగురు అభ్యుదయ రైతులకు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.
ఈ పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు,వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన మేరకు జూన్ 2 వ తేదీన ఈ వినూత్న కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించ బడిందని అన్నారు. ఈ నాణ్యమైన విత్తనాన్ని రైతులు సాగు చేసి తదుపరి పంట ద్వారా ఉత్పత్తియైన విత్తనాన్ని తోటి రైతు సోదరులు కి తక్కువ ధరకే అందజేయాలి అని కోరారు. ఎంపిక చేయబడిన రైతులకు విత్తనోత్పత్తి పై ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా సలహాలు మరియు సూచనలు ఇవ్వబడతాయి అన్నారు. ఈ పథకం ద్వారా రానున్న రెండు మూడు సంవత్సరాలలో ప్రతి గ్రామాన విత్తన స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రం విత్తన భద్రతలో దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలి అన్న దే ముఖ్య ఆశయం అని హర్షం వ్యక్తం చేసారు
ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తనశుద్ధి చేయబడినవి కావున ఈ విత్తనాలు ఆహారంగా వాడకూడదు అని సూచించారు. విత్తన సంచిని పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి కోరారు. ఈ విత్తనాన్ని ఇతర రకం విత్తనాలతో కలప రాదు అని, విత్తనం లో ఏవైనా సమస్యలు ఉంటే,సరఫరా తేదీ నుండి 30 రోజుల్లోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి అని, ఈ విత్తనాలు గ్రామ విత్తన స్వయం సమృద్ధి కోసం అందించడం జరుగుతుందని అన్నారు. అశ్వారావుపేట మండలం లోని 19 రెవెన్యూ గ్రామాలకు 19 యూనిట్లు చొప్పున( 10 కిలోల )వరి విత్తనం డబ్ల్యుజీఎల్ (WGL) – 44, 38 యూనిట్లు పెసర ( 3 కిలోలు),ఎంజీజీ(MGG) – 295 విత్తనం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పి.శివ రామ ప్రసాద్, ఏఈఓ లు సతీశ్,షాకీరా భాను,నార్లపాటి రవీంద్ర ,ఆవుల సూరిబాబు పాల్గొన్నారు.