– శాంతికుమారి సబ్ కమిటీ నివేదికను బయటపెట్టాలి
– జీవో 317 బాధితులకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలి
– ఏడేండ్లు చదివితేనే స్థానికత పాత నిబంధననే అమలు చేయాలి : సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కవిత లేఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
స్థానికత నిబంధనల్లో సమూల మార్పులు చేయాలని తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. జీవో 317 బాధితులకు న్యాయం చేయడానికంటూ అప్పటి సీఎస్ శాంతికుమారితో వేసిన సబ్ కమిటీ నివేదికను బయపెట్టాలని ఆమె కోరారు. బాధితులకు కోరుకున్న చోట పోస్టింగ్ ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానికత కోసం 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేండ్లు తెలంగాణలో చదివితే చాలంటూ తెచ్చిన నిబంధనతో స్థానికులకు అన్యాయం జరుగుతుందనీ, అవకాశాలు కోల్పోతున్నారని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. దాని బదులుగా గతంలో మాదిరిగా ఒకటి నుంచి 10వ తరగతి వరకు మధ్యలో ఏడేండ్లు తెలంగాణలో లేదా సంబంధిత జిల్లాలో చదివితేనే స్థానికత అనే నిబంధననే అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. తద్వారా తెలంగాణ బిడ్డలకు న్యాయం జరుగుతుందని కవిత తెలిపారు. వెంటనే జీవో నం.317 బాధిత ఉద్యోగ, ఉపాధ్యాయులకు వన్ టైం రిలీఫ్ కింద న్యాయం చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కొత్త జిల్లాలకు ఉద్యోగులను సర్దుబాటు చేయడానికంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 317తో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అధికారంలోకి రాగానే ఆ జీవోను రద్దు చేస్తామని పీసీసీ హోదాలో రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కవిత గుర్తుచేశారు. బాధితుల పరిష్కారం కోసమంటూ తెచ్చిన జీవో నెంబర్లు 243, 244, 245తో స్థానికత ఆధారంగా స్వస్థలాలకు బదిలీ చేయాలని కోరుతున్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఉపశమనం దక్కలేదని తప్పుపట్టారు. ఇప్పటికే 20 వేల మంది రిటైర్ అయ్యారనీ, ఆయా ఖాళీ స్థానాల్లో నిరుద్యోగులకు నష్టం జరగకుండా బాధితులకు పోస్టింగ్ ఇచ్చేలా ప్రభుత్వ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
స్థానికత నిబంధనల్లో సమూల మార్పులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



