కాంగ్రెస్ నాయకుల నోట అబద్ధాల యంత్రం : సీపీఐ(ఎం) అగ్రనాయకురాలు బృందాకరత్
పాలక్కాడ్ : ప్రధాని మోడీ బాటలోనే, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకులు కూడా ఒక ”అబద్ధాల యంత్రం”తో కేరళంలో పర్యటిస్తున్నారని సీపీఐ(ఎం) అగ్ర నాయకురాలు బృందా కరత్ వ్యాఖ్యానించారు. పాలక్కాడ్ జిల్లాలో ఎల్డీఎఫ్ ఎన్నికల ప్రచార సభలను ప్రారంభిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.కేరళం ప్రజలతో కాంగ్రెస్ నిజాయితీగా మాట్లాడటం లేదని ఆమె ఆరోపించారు. వారి తాజా హామీ ప్రకారం మహిళలకు రూ.3,000 పింఛను ఇస్తామని చెబుతున్నారన్నారు. కర్నాటక, తెలంగాణలో వారిచ్చిన హామీల గతి ఏమైందో కూడా వారు వివరించాలని ఆమె అన్నారు.
”వారు మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున, రైతులకు ఏటా రూ.12,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేండ్లు గడిచినా, ఒక్క పైసా కూడా లబ్దిదారులకు చేరలేదు” అని ఆమె వెల్లడించారు. బీజేపీతో సీపీఐ(ఎం) సంబంధాలు ఉన్నాయన్న కాంగ్రెస్ ఆరోపణను కూడా బృందా కరత్ ఖండించారు. ”పదేండ్ల ఎల్డీఎఫ్ పాలనలో ఒక్క మత ఘర్షణ కూడా జరగని రాష్ట్రం కేరళ అని, మతతత్వ ‘బుల్డోజర్లు’ ఇక్కడ పాతుకుపోవడానికి ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఏమాత్రం అనుమతించలేదు,” అని ఆమె వ్యాఖ్యానించారు. దీనికి భిన్నంగా, కాంగ్రెస్ పాలిత కర్నాటకలో ఇటీవల 70 మతపరమైన ఘటనలు చోటుచేసుకున్నాయని ఒక మంత్రి అసెంబ్లీలో వెల్లడించిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా ప్రస్తావించారు.



