ఓటర్ల జాబితాల అవకతవకలపై సుప్రీం కోర్టు నిర్ణయం
న్యూఢిల్లీ : బెంగళూరు సెంట్రల్, ఇతర నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాల అవకతవకలపై రాహుల్గాంధీ చేసిన ఆరోపణలపై దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. రిటైర్డ్ జడ్జి నేతృతంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు నిర్వహించాలని ఆ పిల్ కోరింది. ఈ అంశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే పిటిషనర్ భారత ఎన్నికల కమిషన్ను ఆశ్రయించవ్చని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోమాల్యా బాగ్చిలతో కూడిన బెంచ్ సూచించింది. పిటిషనర్ తరపు న్యాయవాది రోహిత్ పాండే మాట్లాడుతూ, ఇసి దగ్గర ఇప్పటికే ఒక పిటిషన్ దాఖలు చేశామని కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు. అయినా బెంచ్ ఇందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. చట్టం కింద ఇంకా అందుబాటులో వున్న మార్గాలను ఉపయోగించుకోవాలని సూచించింది. అలాగే ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ఇసికి కాలపరిమితిని విధించడానికి కూడా బెంచ్ తిరస్కరించింది. బిజెపి, ఎన్నికల కమిషన్ కుమ్మక్కవడం ద్వారా ఎన్నికల ప్రక్రియలో పెద్ద ఎత్తున క్రిమినల్ మోసం జరిగిందని రాహుల్ గాంధీ ఆగస్టు 7నాటి ఒక పత్రికా సమావేశంలో విమర్శించారు. ఈ అంశంపై స్వతంత్ర ఆడిట్ పూర్తయ్యేవరకు ఇసి ఓటర్ల జాబితాలను ఖరారు చేయడం లేదా తదుపరి సవరించడం ఆపాలని కూడా పిటిషన్ కోరింది. ప్రజలు చూసేందుకు, పరిశీలించుకునేందుకు వీలుగా ఆ జాబితాలను ప్రచురించేందుకు ఆదేశాలు జారీ చేయాలని కూడా పిటిషన్ కోరింది.
రాహుల్ గాంధీ పిటిషన్ తిరస్కరణ
- Advertisement -
- Advertisement -