నవతెలంగాణ – హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల కారణంగా వివిధ ప్రాంతాల్లో పిడుగులు పడి ఆరుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. మరో 13 మంది గాయపడ్డారు. పొలం పనుల్లో నిమగ్నమైన రైతులు పిడుగుపాటుకు గురికావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. గాదిగూడ మండలం పిప్పిరి గ్రామంలో మొక్కజొన్న విత్తనాలు వేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో కలిసి మొత్తం 14 మంది పొలంలో ఉండగా, ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. వర్షం నుంచి తలదాచుకునేందుకు సమీపంలోని ఒక తాత్కాలిక గుడిసెలోకి వారు వెళ్లారు. అదే సమయంలో ఆ గుడిసెపై పిడుగు పడటంతో పెందూర్ మాదర్రావు (45), సంజన (22), మంగం భీంబాయి (40), సిడాం రాంబాయి (45) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో 10 మందిని వెంటనే సమీపంలోని ఝురి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. బేల మండలంలోనూ మరో ప్రమాదం సంభవించింది. మండలంలోని వేర్వేరు గ్రామాల్లో పిడుగుపాటుకు ఇద్దరు మహిళా రైతులు మృతి చెందారు. సాంగిడి గ్రామంలో పొలం పనుల్లో ఉన్న నందిని (30) అనే మహిళపై పిడుగు పడటంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, సోన్కాస్లో పత్తి విత్తనాలు వేస్తున్న సునీత (35) కూడా పిడుగుపాటుకు గురై ప్రాణాలు విడిచింది. ఉదయం పొలం పనులకు వెళ్లిన వారు విగతజీవులుగా మారడంతో వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఉట్నూర్ మండలం కుమ్మరితాండలోనూ పిడుగు భయాందోళనలు సృష్టించింది. వ్యవసాయ పనులు చేస్తున్న ముగ్గురు రైతులు, అటుగా వెళ్తున్న సుమారు 15 మంది బాటసారులు వర్షం రావడంతో సమీపంలోని పశువుల పాకలో తలదాచుకున్నారు. ఆ సమయంలో పాకపై పిడుగు పడటంతో కుమ్మరితాండకు చెందిన ఒకే కుటుంబ సభ్యులైన బోకన్ ధన్రాజ్ (27), నిర్మల (36), టోకన్ కృష్ణబాయి (30) గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాంసీ మండలం బండలానాగాపూర్లోని రామాలయంపై కూడా పిడుగు పడింది. ఈ ఘటనలో ఆలయ గోపురం పైభాగం స్వల్పంగా ధ్వంసమైంది. అకాల వర్షాలు, పిడుగుపాట్ల ఘటనలతో జిల్లా రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
వర్ష బీభత్సం.. పిడుగుపాటుకు ఆరుగురు రైతులు బలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES