నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో నూతన అధ్యక్షుడి ఎన్నిక దూమారానికి దారి తీసింది. అధ్యక్ష పదవి ఆశించిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు నిరాశే ఎదురైంది. దీంతో రాజా సింగ్ బీజేపీకి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షపదవికి నామినేషన్ వెయ్యనివ్వలేదని అందుకే రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. తన రాజీనామా లేఖను ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డికి పంపించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి నియామకంపై ఎమ్మెల్యే రాజాసింగ్ నేటి ఉదయం సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్ఠానం నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతోందని, అధ్యక్షుడిని బూత్ కార్యకర్త నుంచి ముఖ్య నేత వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన అన్నారు.
నా, నీ అంటూ నియమించుకుంటూ పోతే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని రాజా సింగ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన రాజీనామా చేసినట్టు తెలిపారు.