భారత కల్చరల్ అకాడమి, తెలుగు ఫిల్మ్ టెలివిజన్ వెల్ఫేర్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో నటప్రపూర్ణ కత్తి కాంతారావు స్మారక జాతీయ పురస్కారాన్ని నటుడు డా.రాజేంద్ర ప్రసాద్కు అందజేశారు.
ఘనంగా జరిగిన ఈ ప్రదానోత్సవ కార్యక్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు, దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి, నటి కవిత, తెలంగాణ ఎఫ్డీసీ ఎండీ, ఐ అండ్ పీఆర్ కమిషనర్ ప్రియాంక, దర్శకులు ప్రేమ్రాజ్, విజన్ వీవీకే అధినేత విజయ్ కుమార్, నాగబాల డి.సురేష్ కుమార్, గీత రచయిత వెనిగళ్ల రాంబాబు, పొలిటికల్ లీడర్ వేణుగోపాలచారి, చిత్తరంజన్, శ్రీనివాసరాజు, అక్కినేని శ్రీధర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పార్థసారథి, రచయిత మామిడి హరికృష్ణ, సినీ పాత్రికేయుడు ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఇదే వేడుకలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నటి జ్యోతి, సీనియర్ నటి డబ్బింగ్ జానకి, కాంతారావు కుమార్తె సుశీలతో పాటు వివిధ రంగాల్లోని మహిళల్ని సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు.
నాగబాల సురేష్ కుమార్ మాట్లాడుతూ,’ఎన్ని వచ్చినా మారనిది మన రాజేంద్రప్రసాద్ హాస్యం, దానికి పోటీ లేదు. ఎన్ని ఏళ్ళు అయినా సరే మనం నవ్వుకుంటూనే ఉంటాం. రాజేంద్రప్రసాద్ కామెడీని దేశ ప్రధాని పీవీ నరసింహారావు ప్రశంసించారు. అలాగే దిగ్గజ సినీ గేయ రచయిత సినారే మెచ్చుకున్నారు. అలాంటి రాజేంద్రప్రసాద్కి కాంతారావు స్మారక జాతీయ పురస్కారం అందించడం ఎంతైనా సముచితం’ అని అన్నారు. ‘నటుడిగా 48 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. ఐదు జనరేషన్ల హీరోలతో కలిసి నటించే అదృష్టం నాకు దక్కింది. రామారావు, నాగేశ్వరరావు ఇండస్ట్రీ కి రెండు కళ్లు అయితే కాంతారావు తిలకం లాంటివారు. జానపద చిత్రాల్లో కాంతారావుకి సాటి ఎవరూ లేరు. ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించే అవకాశం నాకు దక్కింది. నాకన్నా నాకు దక్కిన అవకాశమే గొప్పదని భావిస్తుంటా. గత నలభై ఏళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగువాళ్లు నా సినిమాలు చూసి వాళ్ల జీవితంలోని కష్టాలు మర్చిపోతున్నారంటే నటుడిగా నాకు సార్ధకత చేకూరినట్లే’ అని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
రాజేంద్రప్రసాద్ హాస్యానికి పోటీ లేదు
- Advertisement -
- Advertisement -



