– సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్
– రాష్ట్ర ప్రజావాణిలో జి.చిన్నారెడ్డికి వినతి
నవతెలంగాన-సిటీబ్యూరో
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని రాజీవ్ గృహకల్ప ఇండ్ల రుణాలు మాఫీ చేయాలని సీపీఐ(ఎం) మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజా భవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణిలో తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మెన్ జి.చిన్నారెడ్డికి సీపీఐ(ఎం) నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి పి.సత్యం మాట్లాడుతూ.. 2007-08 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాజీవ్ గృహకల్ప ఇండ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని నిజాంపేట, జగద్గిరిగుట్ట, సూరారం, బండ్లగూడ, అన్నోజిగూడలో సుమారు 20వేల ఇండ్లు నిర్మించారని చెప్పారు. ఇందుకుగాను లబ్దిదారుని వాటాగా రూ.25వేలు, మిగిలిన రూ.75వేలు బ్యాంకు రుణాల ద్వారా నిర్మించారని తెలిపారు. బ్యాంకులు రుణాలు ఇవ్వడంతో ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంకర్స్ దగ్గర ఉన్నాయని, లబ్దిదారులు ఆర్థిక పరిస్థితుల వల్ల రుణాలు చెల్లించలేకపోయారని తెలిపారు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనసుతో పేదల పేర తక్కువ మొత్తంలో ఉన్న ఈ రుణాలను మాఫీ చేయాలని కోరారు. అలాగే, బ్యాంకులో ఉన్న ఇంటి డాక్యుమెంట్లు లబ్దిదారులకు ఇప్పించాలన్నారు. ఈ విషయంపై స్పందించిన చిన్నారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరగానే స్పందిస్తుందని, లబ్దిదారుల వినతి పత్రాలన్నింటినీ హౌసింగ్ బోర్డ్ ఎండీకి పంపించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు రాథోడ్ సంతోష్, ఎం.శంకర్, బి.సబిత, నాయకులు సీహెచ్ యాదయ్య, నర్సింగరావు, విజరు, అరుణ, అనుషియా, యాదగిరి, కృష్ణ, రాహుల్, శ్రీనివాస్, రాజీవ్ గృహకల్ప లబ్దిదారులు పాల్గొన్నారు.న
రాజీవ్ గృహకల్ప ఇండ్ల రుణాలు మాఫీ చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



