నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నవతెలంగాణ దినపత్రిక నూతన సంపాదకుడిగా రాంపల్లి రమేశ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం హైదరాబాద్లోని మోటూరి హనుమంతరావు భవన్లో సీజీఎం పి ప్రభాకర్ అధ్యక్షతన పత్రిక విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. సీపీఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, మాజీ ఎడిటర్ ఆర్ సుధాభాస్కర్, జనరల్ మేనేజర్లు లింగారెడ్డి, రఘు, ఎ వెంకటేశ్, బుక్ హౌస్ ఎడిటర్ కె ఆనందాచారి, బోర్డు సభ్యులు వేణుమాదవ్, సలీమ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు పత్రికకు సంపాదకుడిగా సేవలందించిన ఆర్ సుధాభాస్కర్ ఆరోగ్యకారణాల రీత్యా రిలీవ్ అవుతున్నారని చెప్పారు. ఆయన స్థానంలో ఇన్చార్జి ఎడిటర్గా ఉన్న రాంపల్లి రమేశ్ నూతన ఎడిటర్గా నియమితులయ్యారని తెలిపారు. అనంతరం నూతన ఎడిటర్ రమేశ్ మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా నవతెలంగాణ ధృక్కోణంలో వార్తలు, కథనాలను పాఠకులకు అందించేందుకు ఐక్యంగా కృషి చేద్దామన్నారు. విలేకర్లు, సిబ్బంది అందరం కలిసికట్టుగా ఆ లక్ష్యాన్ని సాధిద్దామని కోరారు.