– విలీన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు : శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై అధికారులతో సీఎస్ రామకృష్ణారావు సమీక్ష
నవతెలంగాణ-శంషాబాద్
హైదరాబాద్ చుట్టుపక్కల వేగంగా అభివృద్ధి జరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. అందులో భాగంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపాలిటీలను సందర్శిస్తున్నట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ను జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డితోపాటు సంబంధిత శాఖల సెక్రటరీలతో కలిసి శుక్రవారం ఆయన సందర్శించారు. అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ఇటీవల ఓఆర్ఆర్ అవతలి వైపు కొన్ని గ్రామాలు, ఓఆర్ఆర్ పక్కన గల గ్రామాలు జీహెచ్ఎంసీలో విలీనమైనందున ఆయా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు ఏ మేరకు అభివృద్ధి చెందుతున్నాయో సమీక్షిస్తున్నట్టు చెప్పారు. తాగునీటి సౌకర్యంపై జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ.. కొత్తగా ఏర్పడిన కాలనీలలో పైప్లైన్లు వేయాలని, అందుకు సంబంధించి అంచనాలు వెంటనే సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత లేకుండా కావాల్సిన నిధులను గ్రామపంచాయతీలకు, మున్సిపాలిటీలకు విడుదల చేస్తున్నట్టు వివరించారు. పన్ను వసూళ్లలో ఈ సంవత్సరం 23 శాతం అతి తక్కువగా చేయడంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్ష్యాలను అధిగమించాలని, కొత్త ఇండ్ల అసెస్మెంట్లను చేయించి, మున్సిపాలిటీల ఆదాయం పెంచాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్ పరిధిలో విద్యుత్ దీపాలు, వార్డుల్లో నాలాల శుభ్రత తదితర అంశాల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చి, ప్రజలకు ఎలాంటి అసౌకర్యమూ కలగకుండా పని చేయాలని అధికారులకు సీఎస్ సూచించారు. అనంతరం కోత్వాల్గూడాలో నిర్మాణంలో ఉన్న హెచ్ఎండీఏ ఎకో పార్కును, రాజేంద్రనగర్ బుద్వేల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించారు. సీఎస్ వెంట రాష్ట్ర మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఇలంబర్తి, హెచ్ఎండీఎ సెక్రటరీ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్, ఆర్డీఓ వెంకట్రెడ్డి, పీడీ హౌసింగ్ నాయక్, తహసీల్దార్ రవీందర్దత్, కమిషనర్ సుమన్రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వేగంగా హైదరాబాద్ అభివృద్ధి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES