పునరుత్పాదక ఇంధనానికి ప్రాధాన్యత ఇవ్వాలి
విద్యుత్ ‘ఇంజినీర్స్ డే’లో ఇంథనశాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిట్టల్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ నెట్వర్క్ వేగంగా విస్తరిస్తున్నదని ఇంథనశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో కూడా ఈ విస్తరణ చాలా వేగంగా ఉన్నదనీ, అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్రంగానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీజీపీఈఏ) ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతి సందర్భంగా ఇంజినీర్స్ డే వేడుకల్ని టీజీ జెన్కో ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన నవీన్మిట్టల్ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. దేశంలో ఇప్పటికే కన్వెన్షనల్ ఎనర్జీ కెపాసిటీ కంటే రెన్యువబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఎక్కువగా ఉందని తెలిపారు. బ్యాటరీ స్టోరేజ్ సిస్టం ప్రాధాన్యతను వివరిస్తూ, విద్యుత్ టారిఫ్ నియంత్రణ చర్యల్ని వివరించారు. భవిష్యత్లో పునరుత్పాదన ఇంథనం స్థాపక శక్తి 250 గిగావాట్లకు చేరుతుందని తెలిపారు.
ఈ సందర్భంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఇంజనీర్ల సేవలను ప్రసంసించారు. త్వరలోనే నూతన నియామకాలు, పదోన్నతులు, శాంక్షన్ పోస్టులు, ట్రాన్స్ఫర్ పాలసీ, జీపీఎఫ్ విషయాలకు పరిష్కారాలు చూపుతామని హామీ ఇచ్చారు. టీజీ జెన్కో సీఎమ్డీ హరీశ్ ఉద్యోగులకు అనుకూలమైన నిర్ణయాలను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. విద్యుత్ ఇంజినీర్ల నిబద్ధతను కొనియాడారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎమ్డీ ముషారఫ్ ఫారూఖీ విద్యుత్ ఉద్యోగులు హైదరాబాద్ సహా రాష్ట్రంలో కుండపోత వర్షాల్లో కూడా నెట్వర్క్ ఫెయిల్ కాకుండా అత్యద్భుతంగా నిర్వహణ చేస్తున్నారని ప్రసంసించారు. రాజధాని హైదరాబాద్లో పూర్తిగా అండర్గ్రౌండ్ కేబుల్ సిస్టంను ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో టీజీపీఈఏ అధ్యక్షులు రత్నాకరరావు అధ్యక్షత వహించారు. అసోసియేట్ ప్రెసిడెంట్ జనప్రియ, అడిషనల్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్లు, టీజీఎన్పీడీసీఎల్ సెక్రటరీ సౌమ్యా నాయక్ పాల్గొన్నారు.