– ఆ నీళ్లనే తాగిన చిన్నారులు
– నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
నవతెలంగాణ – శివ్వంపేట
అధికారుల పర్యవేక్షణ లేకపోవడం.. అంగన్వాడీలో పరిశుభ్రత పాటించ కపోవడంతో చిన్నారుల ప్రాణం మీద కొచ్చింది. తాగు నీటిలో ఎలుక పడినా ఎవరూ గమనించకపోవడంతో పిల్లలు అలాగే తాగారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని రత్నాపూర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. అంగన్వాడీ కేంద్రానికి శనివారం 10 మంది చిన్నారులు హాజరయ్యారు. టీచర్, ఆయా చిన్నారులకు భోజనం తయారు చేసి వడ్డించారు. భోజనం తిన్న తర్వాత పిల్లలు అక్కడే ఉన్న బిందెలోని నీళ్లను తాగారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ తల్లి.. బిడ్డ నీళ్ల కోసం ఏడుస్తుందని బిందె వద్దకు వెళ్లి చూడగా అందులో చనిపోయిన ఎలుక కనిపించింది. ఆ విషయాన్ని అంగన్వాడీ టీచర్కు చెప్పింది. అప్పటికే చిన్నారులు ఎలుక పడిన నీళ్లను తాగారు. విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు వెంటనే అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి చిన్నారులను ఆటోలో నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తమ పిల్లలకు ఏమైతదోనని భయాందోళన చెందారు. మూడ్రోజుల కిందట బిందెలో నల్లా నీటిని పట్టారని, దానికి మూత లేకపోవడంతో ఎలుక పడిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీ టీచర్ అదేమీ చూసుకోకుండా నిర్లక్ష్యం వహించడంతో పిల్లల ప్రాణం మీదకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నారులకు అపాయం లేదు.. : సీడీపీఓ హేమభార్గవి
ఎలుక పడిన నీళ్లు తాగిన చిన్నారులకు ఎలాంటి అపాయమూ లేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరం. అంగన్వాడీ కేంద్రానికి వెళ్లి విచారణ జరుపుతాం. విధుల పట్ల నిర్లక్ష్యం వహిం చిన బాధ్యులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.
రత్నాపూర్ అంగన్వాడీ నీటిలో ఎలుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES