– అధ్యయనం కోసం కమిటీ నియామకం
– విద్యా ప్రమాణాలు, మెరుగైన వసతులే ప్రామాణికం
– విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ నివేదికల పరిశీలన
– పరిగణనలోకి సుప్రీంకోర్టు తీర్పులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫీజుల నిర్ణయంపై హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆయా కళాశాలల్లో బోధన సిబ్బంది, బోధన స్థాయి, కళాశాలల్లో ల్యాబ్లు, భవనాలు. ఇతర వసతులు… ఇలా ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్నంగా పరిశీలించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. కృత్రిమ మేధ (ఏఐ) వంటి కోర్సులు సాంకేతిక రంగంపై బలమైన ప్రభావం చూపుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీపడేలా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్రెడ్డి భావిస్తున్నారు. మారుతున్న మార్కెట్ అవసరాలకు తగినట్టు కళాశాలలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ ప్రణాళికబద్ధంగా ముందుకువెళ్లేలా వ్యవస్థను రూపొందించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల్లో మెరుగైన వసతు లు, బోధన సిబ్బంది, ల్యాబ్లు.. ఏఐసీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని భావిస్తున్నది. ఫీజుల నిర్ణయానికి వాటినే ప్రాతిపదిక తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి ఇస్లామిక్ అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ వర్సెస్ కర్ణాటక, పీఏ ఇనాందార్ అండ్ అదర్స్ వర్సెస్ మహారాష్ట్ర కేసుల్లో… ఆయా కళాశాలల్లోని వసతులు, ల్యాబ్లు, లెక్చరర్ల కు ఆ సంస్థ ఇచ్చే వేతనాలు, బోధన, బోధనేతర సిబ్బంది, కళాశాల భవిష్యత్ ప్రణాళికలు, కళాశాల ప్రమాణాల పెంపునకు తీసుకుంటున్న నిర్ణయాలను ప్రతిపాదిక చేసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఫీజుల నిర్ణయంలో సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజినీరింగ్ కళాశాలల్లో వసతులు, బోధన సిబ్బంది.. ఇతర వ్యవహా రాలపై గత ప్రభుత్వం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ శాఖతో తనిఖీలు చేయించింది. ఆ శాఖ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి నివేదిక రూపొం దించింది. కానీ గత ప్రభుత్వం ఆ నివేదికపై ఎటువంటి చర్య తీసుకో లేదు. కానీ తమకు నచ్చిన కళాశాలలకు ఫీజులు పెంచుకునే అవకాశాన్ని కల్పించి మరికొన్ని కళాశాలలకు మాత్రం పక్షపాత వైఖరితో మొండిచేయి చూపిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ నివేదిక పరిశీలనతోపాటు ఇంజినీరింగ్ కళాశాలల్లో అందుతున్న విద్యా ప్రమాణాలను మదింపు చేసి ఫీజులపై నిర్ణయం తీసుకునేందుకు ఒక కమిటీని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదే సమయంలో ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్దేశిత సమయంలోనే పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించింది.
ఇంజినీరింగ్ ఫీజులపై హేతుబద్ధ నిర్ణయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES