Saturday, June 14, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్బంగారం, వెండి తాకట్టుపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

బంగారం, వెండి తాకట్టుపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: బంగారం, వెండి తాకట్టుపై బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల సొమ్ముతో మనీలాండరింగ్‌ చేస్తున్నారా అనేది ఎప్పటికప్పుడు పక్కాగా బ్యాంకులు తనిఖీ చేయాలని ఆర్బీఐ తాజా ఆదేశాల్లో పేర్కొంది. ‘ఆ సొత్తు ఆ వ్యక్తి సొంతదేనా కాదా అనేది తెలుసుకోడానికి రసీదులు పరిశీలించాలి. అవి లేకపోతే అది సొంతదే అని రాతపూర్వక పత్రాలు తీసుకోవాలి. బంగారం తాకట్టు పెట్టుకుని సులభంగా రుణాలిచ్చేస్తామని మోసపూరిత ప్రకటనలు ఏవీ జారీచేయవద్దు’ అని అన్ని బ్యాంకులకు, ఇతర ఆర్థిక సంస్థలకు ఆర్బీఐ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. బంగారం తాకట్టు రుణాల సొమ్ము దుర్వినియోగమవుతున్నట్టు, రుణాల మంజూరులో పలు సంస్థలు నిబంధనలకు నీళ్లొదిలేస్తున్నాయనే ఆరోపణల నేపథ్యంలో రిజర్వు బ్యాంకు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు

  • ఇక నుంచి ఏ ఒక్క వ్యక్తి పేరుతో కిలో బంగారు ఆభరణాలు, పది కిలోల వెండి ఆభరణాలకు మించి తాకట్టు పెట్టుకోకూడదు.
  • ఆభరణాల విలువలో ఎంత రుణం ఇవ్వాలనేది తీసుకునే రుణ మొత్తం ఆధారంగా నిర్ణయమవుతుంది. ఉదాహరణకు రూ.2.50 లక్షల లోపు రుణం అడిగితే… తాకట్టు పెట్టిన ఆభరణాల విలువ మొత్తంలో 85 శాతం వరకూ ఇవ్వాలి. అంటే ఆభరణం విలువ సుమారు 2.95 లక్షలు ఉంటే సరిపోతుంది.
  • రూ.2.50 లక్షల నుంచి రూ.5 లక్షల లోపు అడిగితే 80 శాతం, రూ.5 లక్షలకు మించి రుణం అడిగితే ఆభరణాల విలువలో 75 శాతం మాత్రమే బ్యాంకు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రుణాలివ్వాలి.
  • బంగారం నాణేలు, బిస్కెట్లు అయితే 50 గ్రాములకు.. వెండి అయితే 500 గ్రాములకు మించి తాకట్టుకు స్వీకరించకూడదు.
  • అనేక బంగారం తాకట్టు రుణాలు ఒకేసారి తీసుకుంటుంటే వాటిని తనిఖీ చేసి విచారించాలి.
  • అప్పుగా ఇచ్చే సొమ్మును రుణగ్రహీత బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలి.
  • రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోగా తిరిగి చెల్లించాలి. చెల్లించకపోతే తాకట్టు సొత్తును వేలం వేయాలి. వేలం ప్రక్రియను రెండుసార్లు నిర్వహించాలి. మొదట.. బ్యాంకు ఉన్న జిల్లా పరిధిలో, అప్పుడు పూర్తికాకపోతే రెండోసారి.. ఆన్‌లైన్‌ విధానంలో లేదా పక్క జిల్లాలోనైనా నిర్వహించవచ్చు.
  • రుణ బకాయి చెల్లించినా రెండేళ్లలోగా సొత్తును తిరిగి తీసుకెళ్లకపోతే బ్యాంకు… పాలకమండలికి వివరించాలి. రుణగ్రహీతలు, వారి వారసులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని సమాచారం పంపాలి.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -