– ప్రస్తుతం ఆ ప్రాంఛైజీ విలువ రూ.17 వేల కోట్లు
– ఈ ఏడాదే తొలిసారి ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక ఆదరణ కలిగిన జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూర్. 18 ఏండ్లలో తొలిసారి ఐపీఎల్ చాంపియన్గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ను అమ్మేందుకు యాజమాన్యం సిద్ధమైందని సమాచారం!. ఐపీఎల్ టైటిల్తో ఆర్సీబీ బ్రాండ్ విలువ గణనీయంగా పెరుగగా.. ప్రస్తుతం ఆ జట్టు ధర రూ.17132 కోట్లుగా ఉంది.
నవతెలంగాణ-ముంబయి
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఐపీఎల్18 విజేతగా నిలిచి వారం రోజులే అవుతోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో 2008 నుంచి పోటీపడుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ నాలుగు సార్లు ఫైనల్స్కు చేరినా.. ఈ ఏడాదే టైటిల్ సాధించింది. 18 ఏండ్ల నిరీక్షణ ముగియటంతో దేశవ్యాప్తంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. హైదరాబాద్లోనూ సచివాలయం వద్ద ఆర్సీబీ అభిమానులు విజయోత్సవాలు చేసుకున్నారు. బెంగళూర్లోని చిన్నస్వామి స్టేడియం వద్దకు సుమారు 2.3 లక్షల మంది అభిమానులు పోటెత్తడటంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరుగగా..11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. పలువురు అభిమానులు తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆర్సీబీకి బలమైన అభిమాన గణం ఉందని అందరికీ తెలిసినా.. ఆ జట్టు విజయంతో అది ఏ స్థాయిలో ఉందో కార్పోరేట్ మార్కెట్కు తెలిసొచ్చింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ యాజమాన్యం డయాజియో పిఎల్సి (బ్రిటీష్ లిక్కర్ దిగ్గజ కంపెనీ) స్పోర్ట్స్ లీగ్లపై ఆసక్తి లేకపోవటం సహా పలు ఇతర కారణాలతో ఆర్సీబీని అమ్మేందుకు ప్రయత్నం చేస్తోందని ‘బ్లూమ్బర్గ్’ ఓ కథనం వెలువరించింది. దీంతో భారత క్రికెట్ వర్గాల్లో ఇప్పుడు ‘ఆర్సీబీ అమ్మకానికి’ వార్త హాట్ టాపిక్గా మారింది.
అమ్మకం ఎందుకు?
డయాజియో పిఎల్సి ప్రపంచ లిక్కర్ మార్కెట్లో దిగ్గజ కంపెనీ. యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (డయాజియో ఇండియా) ద్వారా డయాజియో పిఎల్సి ఆర్సీబీ యజమాన్య కంపెనీ. ప్రపంచ లిక్కర్ మార్కెట్లో ఖరీదైన ఆల్కహాల్కు డిమాండ్ క్రమేపి తగ్గుతూ వస్తోంది. అమెరికాలో విదేశీ మద్యంపై విపరీత టారీఫ్లు విధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డయాజియో కంపెనీ ఒత్తిడి ఎదుర్కొంటుంది. భారత్లోనూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ ఇటీవల కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. స్పోర్ట్స్ ద్వారా పొగాకు, మద్యం ప్రచారం, ప్రకటనలపై ఆంక్షలు విధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ టీమ్ సహా స్టార్ క్రికెటర్ల ప్రకటనలతో డయాజియో పిఎల్సి కంపెనీ మద్యం బ్రాండ్లను సోడా, ఇతర ఉత్పత్తుల ప్రకటనలతో మార్కెట్ చేసుకునే అవకాశం కోల్పోయినట్టు అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో ఆర్సీబీ అమ్మకం ద్వారా వచ్చే నిధులు ఆ కంపెనీకి ఉపయుక్తంగా ఉండనున్నాయి. దీంతో ఆర్సీబీని అమ్మేందుకు డయాజియో సిద్ధమైందని వార్తలు వచ్చాయి.
విలువ రూ.17 వేల కోట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్కు తొలి నుంచీ అభిమానుల్లో మంచి ఆదరణ ఉంది. భారత క్రికెట్ సూపర్స్టార్ విరాట్ కోహ్లి ఆర్సీబీ ముఖచిత్రం కావటం ఆ ప్రాంఛైజీకి కలిసొచ్చింది. ఐపీఎల్ను పది జట్లకు పెంచుతూ కొత్త ప్రాంఛైజీల కోసం జరిగిన వేలంలో రూ.7090 కోట్లకు లక్నో సూపర్జెయింట్స్ను వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా కొనుగోలు చేశారు. ఇటీవల గుజరాత్ టైటాన్స్ ప్రాంఛైజీలో 67 శాతం వాటాను టోరెంటో గ్రూప్ రూ.7500 కోట్లకు సొంతం చేసుకుంది. పది వేల కోట్లకు కొత్త ప్రాంఛైజీ దక్కే అవకాశాలు ఉన్నప్పటీకీ.. మార్కెట్లో నిలదొక్కుకున్న, బ్రాండ్లు ప్రచారం కోసం వెంటబడుతున్న జట్టు ఆర్సీబీ. ఆర్సీబీ విలువను రూ.8500 కోట్లుగా కొందరు అంచనా వేసినా.. ఐపీఎల్ ఫౌండర్ చైర్మెన్ లలిత్ మోడీ ఆ అంచనాలను కాదని అసలు విలువ రూ.17 వేల కోట్లకు (2 బిలియన్ అమెరికన్ డాలర్లు) ఉంటుందని అన్నారు. గుజరాత్ టైటాన్స్లో టొరెంటో గ్రూప్ కొనుగోలు చేసిన విలువను ఆర్సీబీకి అన్వయించలేమని లలిత్ మోడీ అభిప్రాయం.
ఆ వార్తల్లో వాస్తవం లేదు!
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ను అమ్మకానికి పెట్టినట్టు వస్తున్న వార్తలను డయాజియో ఇండియా కొట్టిపారేసింది. ఈ వార్తల్లో వాస్తవం లేదని బాంబే స్టాక్ ఎక్చేంజ్, బిఎస్ఈ సర్వేలియన్స్ విభాగానికి డయాజియో ఓ లేఖ రాసినట్టు సమాచారం. ‘ఆర్సీబీకి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నామని వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదు. అటువంటి చర్చలు జరుగలేదు. ఇది మీ సమాచారం కోసం ఇస్తున్న వివరణ’ అని డయాజియో ఇండియా వైస్ ప్రెసిడెంట్ మిటల్ సంఘ్వీ ఓ ప్రకటనలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
అమ్మకానికి ఆర్సీబీ?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES