నిర్మాణ రంగంలో 11.97 శాతం పెరుగుదల :
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీ వృద్థిని నమోదు చేసుకుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. గతేడాది కన్నా రియల్ ఎస్టేట్ రంగం తగ్గిందంటూ కొందరూ కావాలనే పనిగట్టుకొని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ”టైమ్స్ హౌమ్ హంట్ ప్రాపర్టీ ఎక్స్ పో 2025”ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ”2024- 25 ఆర్థిక సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగంలో 15.4 శాతం వృద్ధి రేటు నమోదయ్యింది. నిర్మాణ రంగం 11.97 శాతం వృద్ధి చెందింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం రూ.80వేల కోట్లు సమకూర్చింది. తెలంగాణ సర్వీసెస్ ఎకానమీలో ఈ రియల్ వాటా 24.9 శాతం. ప్రస్తుతం రెరా దగ్గర 9,744 రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రిజిస్ట్రర్ అయ్యాయి. ఇవి గణాంకాలు కాదు… మా హయాంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం నెమ్మదించిందటూ తప్పుడు ప్రచారం చేస్తున్న వారికి చెంప దెబ్బ” అని శ్రీధర్బాబు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక్క హైదరాబాద్ లోనే 5,900 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయని గుర్తు చేశారు. మొత్తం రిజిస్ట్రేషన్లలో రూ.కోటి, అంత కంటే ఎక్కువ ధర గల ఇండ్ల వాటా 18 శాతంగా ఉందని చెప్పారు. ఈ తరహా ఇండ్ల కొనుగోళ్లలో వార్షిక వృద్ధి రేటు 58 శాతంగా నమోదు అయ్యిందని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించింది” అని మంత్రి పేర్కొన్నారు. ”రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న నిర్మాణ రంగం అభివృద్ధికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నాం. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఈ రంగానికి అవసరమైన అత్యుత్తమ నైపుణ్య మానవ వనరులను తయారు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం” అని తెలిపారు. ఈ రంగానికి సర్కార్ తోడ్పాటునందిస్తుందని రియల్టర్లకు ఈ సందర్భంగా మంత్రి హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, గండ్ర సత్యనారాయణ రావు, క్రెడారు అధ్యక్షులు జైదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ”రియల్ బూమ్”
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES