Saturday, July 26, 2025
E-PAPER
Homeమానవిజీవితాల‌ను పున‌ర్నిర్మించుకుంటూ…

జీవితాల‌ను పున‌ర్నిర్మించుకుంటూ…

- Advertisement -

చెన్నై నగరంలో మొగప్పైర్‌ ప్రాంతంలో నిరాశ్రయులైన మహిళల కోసం ఓ సంరక్షణ కేంద్రం ఉంది. అందులోని మహిళలంతా పిండి కలపడంలో బిజీగా ఉంటారు. వారెవరూ చెఫ్‌లుగా శిక్షణ పొంద లేదు. తమ మనసుకైన గాయం నుండి కోలుకునేందుకు వారు చేస్తున్న నిశ్శబ్ద ప్రయోగంలో ఓ భాగం ఇది. రెండు దశాబ్దాల నుండి చెన్నైకి చెందిన ది బన్యన్‌ అనే సంస్థ మహిళల మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించి. నిరాశ్రయులై, దీర్ఘకాలిక మానసిక పరిస్థితులను ఎదుర్కొంటున్న వారి సంరక్షణ కోసం ఆహార ఆధారిత శిక్షణను నిర్వహిస్తుంది. నివాస కేంద్రాలలో కమ్యూనిటీ కేఫ్‌లు, బేకింగ్‌ వర్క్‌షాప్‌లు నిర్వహిస్తుంది. దీని పని కేవలం మహిళల్లో నైపుణ్యాలు పెంపొందించడం మాత్రమే కాదు వారు వారి జీవితాన్ని సమర్థవంతంగా నిర్వహించుకునేలా తీర్చిదిద్దుతున్నారు. స్థిరత్వం, ఎంపిక, కొనసాగింపు భావన వైపు ఒక అడుగువేసేలా తీర్చిదిద్దుతున్నారు.

తొమ్మిదేండ్ల కిందట మహిళా నివాసితుల పోషకాహారాన్ని మెరుగుపరిచేందుకు మొగప్పైర్‌లోని ఆరోగ్య స్పృహ కలిగిన ‘హోమ్‌ బేకరీ హోల్సమ్‌ రాప్సోడి’ వ్యవస్థాపకుడు సెంథిల్‌ కుమార్‌ బాలును అప్పటి మానసిక వైద్యుడు డాక్టర్‌ అన్బుదురై ఆహ్వానించారు. ‘ఆహార మార్పులను పరిశీలించడానికి నన్ను తీసుకువచ్చారు. శుద్ధి చేసిన ధాన్యాలు, చక్కెరల నుండి మెరుగైన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే తృణధాన్యాల ఎంపికలకు మారారు. కానీ దీన్ని నివాసితుల కోసం ఒక కార్యకలాపంగా మార్చవచ్చని అతి తక్కువ కాలంలోనే స్పష్టమైంది’ అంటూ బాలు హెర్‌స్టోరీ అనే ఓ ఆంగ్లవెబ్‌సైట్‌తో సంభాషించారు. బేకింగ్‌ వర్క్‌షాప్‌ ఆలోచన వేళ్ళూనుకున్నప్పుడు బాలు వారపు సెషన్‌లను నిర్వహించారు.
స్నేహం స్థిరంగా
నివాసితులు చాలా మంది ఏండ్లుగా నిరాశ్రయులుగా ఉన్నారు. మిల్లెట్లు, పామ్‌ షుగర్‌, పండ్ల తొక్క ల వంటివి ఉపయోగించి కేకులు, మఫిన్‌లను తయారు చేయడం నేర్చుకున్నారు. ‘మీ చేతులతో స్వయంగా తయారుచేసిన తీపి వంటకం ఏదైనా చాలా తృప్తినిస్తుంది. ఈ భావన ఇక్కడి మహిళలకు మరింత పెరిగింది’ అని బాలు పంచుకున్నారు. ది బన్యన్‌ విస్తృత (పెంపకం, అవగాహన, జీవనోపాధి, మానసిక ఆరోగ్యం) కార్య క్రమం కింద నలం బేకర్స్‌ ప్రారంభమైంది. మహిళలు ప్రతి వారం ఇందులో పాల్గొన్న ప్పటికీ కొంతమంది టైలరింగ్‌, కిరాణా పనులతో దూరంగా వెళ్లారు. అయితే వారి మధ్య స్నేహం స్థిరంగా ఉంది.

సవాలుగా మారినా…
‘ఒక సమూహం జల్లెడ పట్టేది, మరొకటి కలపేది, మరొకటి పాన్లలో పోసేది. అరవై నుండి డెబ్బై శాతం మంది రెగ్యులర్‌గా ఇక్కడే ఉండి పని చేస్తారు. అప్పుడే పూర్తి స్థాయి యూనిట్‌ను ఎందుకు సృష్టించకూడదనే ఆలోచన వచ్చింది’ అంటూ బాలు పంచుకున్నారు. మహిళలు అతి తక్కువ కాలంలో నేర్చుకొని తయారు చేసిన కేకులు, మఫిన్లు, కుకీలను సందర్శకులకు, సిబ్బందికి అమ్మడం ప్రారంభించారు. అయితే దీన్ని ఓ వాణిజ్య వెంచర్‌గా మార్చడం సవాలుగా మారింది. ఆర్డర్లు, ప్యాకేజింగ్‌, డెలివరీలు చేయడం కష్టమైంది. తర్వాత కోవిడ్‌-19 వచ్చింది. పని పూర్తిగా ఆగిపోయింది’ అని బాలు వివరించారు. ఈ కార్యక్రమం ఇప్పుడు నెమ్మదిగా తిరిగి ప్రారంభమయింది. వంటగది పునరుద్ధరణలు జరుగుతున్నాయి. తక్కువ బృందంతో తయారు చేయగలిగిన బేకింగ్‌ బ్రెడ్లు, బన్స్‌ వంటి మరింత స్థిరమైన నమూనాలను అన్వేషిస్తున్నారు. మెల్లమెల్లగా ఆర్డర్లు పెరిగాయి. మహిళలు వారానికి మూడు సార్లు ఆరోగ్యకరమైన పదార్థాలను ఉపయోగించి బేకింగ్‌ పద్ధతుల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ‘వారు నేర్చుకోవడమే కాదు, ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు’ అని ది బన్యన్స్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనిట్‌లో ప్రొడక్షన్‌ మేనేజర్‌ మేరీ శశికళ చెప్పారు.

స్వీయ భావనతో…
‘మన స్త్రీలలో చాలామంది కుటుంబ జీవితం నుండి డిస్‌కనెక్ట్‌ చేయబడ్డారు. అక్కడ వంట ఒకప్పుడు వారి దినచర్యలో భాగంగా ఉండేది. కాలక్రమేణా గాయం, ఒంటరితనం కారణంగా, వారు ఎలా వండాలో కూడా మర్చిపోతారు. కానీ ఈ సెషన్లలో వారి జ్ఞాపకశక్తి తిరిగి రావడం మనం చూస్తాము. వారు రంజాన్‌, అమ్మమ్మ చట్నీ, పండుగ ఆహారాన్ని తయారు చేస్తూ ఆనందిస్తారు. స్నేహం, ఆనందం, స్వీయ భావన వారిలో ఉద్భవిస్తుంది. 2022లో ది బన్యన్‌ కోవలంలో తిన్నై కేఫ్‌ను ప్రారంభించింది. ఇది పూర్తిగా మహిళా నివాసితులచే నిర్వహించబడుతుంది. వారు దక్షిణ భారత ఆహారాలైన ఇడ్లీలు, దోసెలు, భోజనం వండి ప్రజలకు అందిస్తారు, నెలవారీ జీతాలు సంపాదిస్తారు.

గౌరవమైన జీవితం
అన్నమేరీ రెండు దశాబ్దాల కిందట ది బన్యన్‌కు క్లయింట్‌గా వచ్చింది. నేడు ఆమె 2022లో ప్రారంభమైన డిలైట్‌ మసాలాను తోటి నివాసి నందినితో కలిసి నడిపిస్తుంది. చేతితో తయారు చేసిన మసాలా ఇప్పుడు తిన్నై కేఫ్‌లోని వంటగదిలో ప్రధానమైనది. ప్రతి భోజనానికి రుచిని జోడిస్తుంది. తమిళనాడు విద్యా శాఖ, విన్నర్స్‌ బేకరీ భాగస్వామ్యంతో నుంగంబాక్కంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌లో ూ×జువీAు క్యాంటీన్‌ నడుస్తుంది. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న దాదాపు 20 మంది మహిళా సిబ్బంది ఇప్పుడు రోజుకు 400 మందికి పైగా సేవలందిస్తున్నారు. మహిళలు నైపుణ్యాలు, విశ్వాసం, జీతంతో కూడిన ఉద్యోగంతో గౌరవంగా బతుకుతున్నారు.

అపారమైన జ్ఞానసంపద
ఒకప్పుడు రత్నగిరి ప్రాంతీయ మానసిక ఆసుపత్రిలోని జయశ్రీ, అక్టోబర్‌ 2019లో ది బన్యన్స్‌ హోమ్‌ ఎగైన్‌ ప్రోగ్రామ్‌ అయిన దాని సమగ్ర గృహ కార్యక్రమంలోకి మారింది. అనేక వ్యక్తిగత నష్టాలను చవిచూసిన ఆమె ప్రయాణం రత్నగిరిలో తన మొదటి సామాజిక సంస్థ, ఫుడ్‌ కార్ట్‌ను ప్రారంభించినప్పుడు ఉత్తేజకరమైన మలుపు తీసుకుంది. ప్రణాళిక ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తూ, జయశ్రీ ఫుడ్‌ కార్ట్‌లో పనిచేసే అవకాశాన్ని పొందింది. ఆమె పేరు మీద ఫుడ్‌ లైసెన్స్‌ కూడా పొందింది. ‘నా ప్రయాణంలో నేను చాలా వదులుకున్నారు. ఇప్పుడు అపారమైన జ్ఞాన సంపదను సంపాదించాను. అయితే స్వావలంబన మనలో అంతర్లీనంగా ఉందని నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. పరిస్థితులతో సంబంధం లేకుండా నేను ఆ లక్ష్యం వైపు కృషి చేయగలను’ అని ఆమె చెప్పింది. సంస్థాగత సంరక్షణ నుండి ‘హోమ్‌ ఎగైన్‌’లోకి మారుతున్న మహిళలకు, ఈ వంటగది ఆధారిత శిక్షణలు కేవలం నైపుణ్యాలు మాత్రమే కాదు వారి జీవితాన్ని నిర్మించే ముఖ్యమైన సాధనాలు. ‘మహిళలు ఇక్కడికి వివిధ ప్రాంతాలు, వర్గాల నుండి వచ్చారు. కానీ ఆరోగ్యకరమైన ఆహారం వారందరినీ ఒక దగ్గరకు చేర్చింది. ఇది వారు తమను తాము తిరిగి పొందటానికి సహాయ పడుతుంది’ అని శశికళ చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -