– ఐపిఎల్ క్రీడాకారులకు పౌర సన్మానం
– అభిమానులతో పోటెత్తిన చిన్నస్వామి స్టేడియం
బెంగళూరు: 18ఏళ్ల తర్వాత ఐపిఎల్ ట్రోఫీని తొలిసారి కైవసం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్రీడాకారులకు ఘన స్వాగతం లభించింది. ఐపిఎల్ ట్రోఫీతో బుధవారం రాష్ట్రానికి చేరిన బెంగళూరు జట్టుకు విమానా శ్రయంలో తొలుత ఘన స్వాగతం లభించగా.. ఆ తర్వాత ఐపిఎల్ ట్రోఫీని ప్రదర్శిస్తూ క్రీడాకారులు టాప్లెస్ బస్లో ఊరేగింపుగా చిన్నస్వామి స్టేడియంకు బయల్దేరి వెళ్లారు. అక్కడ కిక్కిరిసిన అభిమానుల మధ్య తమ కలల కప్ గెలిచిన క్రీడాకారులకు ప్రత్యక్షంగా చూసేందుకు లక్షలాదిగా అభిమానులు విచ్చేశారు. ‘ఈ సల నమ్దే'(ఈసారి కప్ మనదే) నినాదంతో చిన్నస్వామి స్టేడియం మొత్తం మార్మ్రోగగా.. ఈ కార్యక్రమానికి ఉచిత ప్రవేశం కల్పించడంతో స్టేడియం లోపలికి అభిమానులు వెళ్లే క్రమంలో భారీ తొక్కిసలాట జరిగింది. స్టేడియం సామర్థ్యం 35వేలు కాగా.. సుమారు 2 నుంచి 3లక్షల మంది అభిమానులు విచ్చేసినట్లు సమాచారం. దీంతో త్రొక్కిసలాట జరిగిన సుమారు 11మంది మృతిచెందినట్లు సమాచారం. ఈ కార్యక్రమం ముగిసిన అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మాట్లాడుతూ.. విజయోత్సవ వేడుకకు ఇంత పెద్ద సంఖ్యలో జనం వస్తారని ఊహించలేదని, ‘విక్టరీ పరేడ్’లో త్రొక్కిసలాట జరగడం కొందరు మృతిచెందడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
అభిమానులు చనిపోవడం దురదృష్టకరం: బిసిసిఐ
‘విక్టరీ పరేడ్’ సందర్భంగా అభిమానులు మరణించడంపై బిసిసిఐ సెక్రటరీ దేవజిత్ సైకియా విచారం వ్యక్తం చేశాడు. అభిమానులు చనిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించిన సైకియా.. విజయోత్సవ యాత్రను పక్కాగా నిర్వహించాల్సిందని అభిప్రాయపడ్డాడు. ‘ఫ్యాన్స్ తమ అభిమాన క్రికెటర్లను పిచ్చిగా ఆరాధిస్తారు. అందుకే.. ఇలాంటి విక్టరీ పరేడ్లు జరిపే సమయంలో నిర్వాహకులు ప్రణాళికాబద్ధంగా ఉండాలి. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.. గాయపడిన వారు కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని సైకియా తెలిపాడు.
ఎరుపెక్కిన బెంగళూరు
- Advertisement -
- Advertisement -