Saturday, June 14, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిచట్టసభల కాలం తగ్గడం, దేశానికి నష్టదాయకం!

చట్టసభల కాలం తగ్గడం, దేశానికి నష్టదాయకం!

- Advertisement -

ఏకపక్ష పాలన కోసం కేంద్రపాలకులు అధ్యక్ష తరహా పాలనవైపు మొగ్గుచూపుతున్నాయి. ప్రజలు దాన్ని తోసిపుచ్చి పార్లమెం టరీ ప్రజాస్వామ్యాన్ని ఎంచుకుంటు న్నారు. చర్చలు, ప్రశ్నలు, జవాబు లతో కార్య నిర్వహక వర్గాన్ని, చట్టసభలను జవాబుదారీ చేయాలనే ఇందులో సదుద్దేశం. ఇది ప్రజా ప్రతినిధుల ద్వారా నిర్మాణాత్మక అధికారం పౌరులందరి చేతుల్లో ఉంచబడే ఆయుధం. ఇటీవల జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రదాడులు అమాయకుల ప్రాణాలు తీసినప్పుడు ఆ దేశంపై యుద్ధ సన్నద్ధత కోసం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దానికి ప్రధాని గైర్హాజరు కావడం గమనార్హం. ఆ తర్వాత నాలుగు రోజుల్లో యుద్ధవాతావరణం, ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ విషయాన్ని సామ్రాజ్యవాద దేశ అధిపతి ట్రంప్‌ ”ఎక్స్‌”లో ప్రకటించడంతో కేంద్రం దానికి అనుగుణంగా విరమించింది. అయితే ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టడానికి అఖిలపక్ష ఎంపీలతో ప్రతినిధి బృందాలను పంపడంలో ఉన్న శ్రద్ధ, పార్లమెంటును సమావేశపరిచి యుద్ధానంతర పరిణామాలను తెలియపరిచే బాధ్యత కేంద్రం చేయలేదు. 1962,1971 ఇండో-పాక్‌ యుద్ధ సమయాల్లో సభకు అప్పటి పరిస్థితులను ప్రభుత్వాధినేతలు వివరించారు.కానీ, నేడు దేశాన్ని ఏలుతున్నవారు ఆ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. భారత పునర్నిర్మాణం, ప్రజాస్వామ్య రక్షణ, రాజ్యాంగబద్ధ పాలన కోసం చట్టసభలు పనిచేస్తున్నవి. కానీ వాటిని అమలు చేయడంలో పాలకుల నిర్లక్ష్యం ప్రజల్ని నిండా ముంచుతున్నది. పార్లమెంట్‌, రాష్ట్రాల అసెంబ్లీలు ప్రతి ఏటా విరివిగా భేటీ కావాల్సి ఉన్నప్పటికీ అది అంతంతమాత్రంగానే ఉన్నది. పాలకుల తప్పులను ఎండగడుతూ ప్రజాసేవలో నాణ్యత, చిత్తశుద్ధి పెంపునకు దేశ ఆత్మ గౌరవానికి, సార్వ భౌమాధికారానికి భంగం వాటిల్ల కుండా సూచనలు అందించాల్సి ఉన్నప్ప టికీ ఆ దిశగా అడుగులు వేయకపోవడం లోపంగా కనిపిస్తున్నది. పార్లమెంట్‌, అసెంబ్ల్లీల్లో ప్రజా సమస్యలపై ఎంపీలు, ఎమ్మెల్యేలు గళమెత్తుతూ వాటి పరిష్కా రానికి కృషి చేయడం వారి ప్రధాన కర్తవ్యంగా ఉన్నా దాన్ని పట్టించుకోకపో వడం శోచనీయం.చట్టసభలు మొక్కు బడిగా సమావేశమవుతుంటే? ప్రజా ప్రతి నిధులు తమ బాధ్యతలను ఎలా నిర్వహించగలరు?
మన దేశంలో చట్టసభలు సమావేశమయ్యే రోజులు నానాటికీ తగ్గిపోతున్నాయి. అంతేకాదు, ఉద్దేశపూర్వకంగా అంతరాయం కల్పిం చడం సంఖ్యాబలంతో చర్చలు జరపకుండానే ఏకపక్షంగా బిల్లులు ఆమోదించుకోవడం మూలంగా మన దేశ చట్టసభల గౌరవ మర్యా దలు అడుగంటి పోతున్నాయి. మనదేశంలో మొదటి లోక్‌సభ వార్షిక సగటు పనిదినాలు 135 రోజులు అయితే, 17వ లోకసభ (2019-24)కు వచ్చేసరికి అవి 55కు పడిపోయాయి. చట్టసభల భేటీ సంఖ్య తగ్గి పోవడంపై స్పీకర్ల సదస్సు (ఏఐపీఓసీ) గతంలోనే ఆందోళన చెంది, ఇవి సాలీనా ఎన్ని రోజులు సమావేశమవ్వాలో నిర్దేశిస్తూ రాజ్యాంగ నిబంధనలను రూపొందించాలని 1993 ”ఏఐపీఓసీ” తీర్మానించింది. ఆ మేరకు 70 మంది కంటే తక్కువ సభ్యులు ఉన్న అసెంబ్లీ ఏడాదికి కనీసం యాభైరోజులు కొలువుదీరాలని, మిగిలిన రాష్ట్రాల చట్టసభలు తొంభై రోజులు నడపాలని సంధాన సమీక్ష సంఘం (జస్టిస్‌ వెంకటాచలమయ్య) కమిషన్‌ సిఫారసు చేసింది. ఆ మేరకు రాజ్యసభ 100, లోక్‌సభ 120 రోజులపాటు భేటీ కావాలి. కానీ ఈ సూచనలేవి అమలు కాకపోవడంతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలుగుతోంది. దీంతో ప్రభుత్వాలపై చట్టసభల పర్యవేక్షణతో పాటు పాలనలో పారదర్శకత అడుగంటి పోతోంది. చట్టసభల భేటీ తగ్గిపోవడంతో పాటు, అనవసర వాగ్వివాదాలతో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన కాలాన్ని వృధా చేయడం, నిశిత చర్చలు లేకుండానే మంద బలంతో కార్పొరేట్లకు ఉపయోగపడే చట్టాలు ఆమోదించుకోవడం మరో దౌర్భగ్యం. ప్రజాప్రయోజనాల్ని, శ్రేయస్సును గాలికొదిలేసి నాయకులు అధికారానికి సాగిలపడి వ్యక్తి పూజతో విలువైన సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేస్తుంటే ప్రజలు ప్రశ్నించక్కర్లేదా?
పని వేళల సగటు 20 రోజులే.. 500 బిల్లులకు ఆమోదం అంటూ (పీఆర్‌ఎస్‌ లెజిస్లేటివ్‌ రిసెర్చ్‌ సంస్థ) అధ్యయనం ఈ విష యాన్ని తెలియజేసింది. మన దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన శాసనసభలు గత సంవత్సరం సగటున 20 రోజులు 100 గంటలు మాత్రమే పనిచేశాయి. ఆ కాలంలో 17 బిల్లులను ఆమోదించాయి. వీటిలో 51శాతం బిల్లులు ప్రవేశపెట్టిన ఒక్కరోజు వ్యవధిలోనే ఆమోదం పొందాయి. ఒడిశా శాసనసభ 42 రోజులు, కేరళ శాసనసభ 37 రోజులు, పశ్చిమబెంగాల్‌ శాసనసభ 36 రోజులు పనిచేసి కొంత మెరుగనిపించాయి. కర్నాటక శాసనసభ ఏడాదికి 60 రోజులు సమావేశం కావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నప్పటికీ, కేవలం 29 సీటింగ్స్‌ మాత్రమే జరిగాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌ ఏడాదికి 90 సీటింగ్స్‌ జరపాలని అనుకుంటే, కేవలం 16 సమావేశాలతోనే సరిపెట్టింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ కూడా 16 రోజులే సమావేశమైంది. మణిపూర్‌లో 14, జమ్ము కాశ్మీర్‌ 5, నాగాలాండ్‌ 6, సిక్కింలో 8 రోజులపాటు శాసనసభ సమావేశాలు జరిగాయి. రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర శాసనసభలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశం కావాల్సి ఉంటుంది. కానీ ఒకటి రెండు రోజులు స్వల్పకాలిక సిట్టింగ్లతో కలిపి 11 రాష్ట్రాల్లో ఈ నియమాన్ని పాటించాయి. 2017 నుంచి ఏడాదికి సగటున 30 రోజుల కంటే తక్కువగా సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో 28 సీటింగ్స్‌ జరగ్గా, 2020లో కోవిడ్‌ కాలంలో ఆ సంఖ్య 16కు పడిపోయాయి. అప్పటినుంచి సగటున ఏడాదికి సుమారు 20 రోజుల పాటే సమావేశాలు జరిగాయి.
2018లో సగటున 26 సీటింగ్స్‌, 2019లో 24 సీటింగ్స్‌, 2021లో, 22లో 21 సీటింగ్స్‌ చొప్పున, 2023లో 22 సీటింగ్స్‌ జరగగా గత సంవత్సరం ఆ సంఖ్య 20 కి తగ్గిపోయింది. కొన్ని రాష్ట్రాలు శాసనసభ ద్వారా లేదా నిబంధనలు రూపొందించుకోవడం ద్వారా కనీసం వార్షిక సిట్టింగ్స్‌ను నిర్దేశించుకున్నప్పటికీ 2017 నుంచి 2024 మధ్య వాటిలో ఏ రాష్ట్రము లక్ష్యాన్ని చేరలేదని నివేదిక వేలెత్తి చూపింది. గత సంవత్సరం శాసనసభలు సగటున 100 గంటలు సమావేశం అయ్యాయి. కేరళ అత్యధికంగా 228 గంటల పాటు సమావేశం నిర్వహించగా, ఒడిస్సా 193 గంటలు, మహారాష్ట్ర, రాజస్థాన్‌ 187 చొప్పున, గోవా 172, ఛత్తీస్‌గఢ్‌ 155, తెలంగాణ 149, కర్నాటక 145 (గంటలు) తర్వాత స్థానాల్లో నిలిచాయి. బిల్లులకు సంబంధించి సగటున ప్రతి శాసనసభ 17 బిల్లులను ఆమోదించింది. గతేడాది మొత్తం మీద 500 బిల్లులు ఆమోదం పొందాయి. 49 బిల్లులతో కర్నాటక మొదటి స్థానంలో నిలువగా, తమిళనాడు 45, హిమాచల్‌ ప్రదేశ్‌ 32, మహారాష్ట్ర 32 తర్వాత స్థానాల్లో నిలిచాయి. ఢిల్లీ శాసనసభ కేవలం ఒకే బిల్లును ఆమోదించగా, రాజస్థాన్‌ అసెంబ్లీ రెండు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇలా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగబద్ధ పాలనలో ప్రజాప్రతినిధుల పాత్ర, చట్టసభల నిర్వహణ భేటీ తగ్గిపోతుంటే,. ప్రజా సమస్యలు ఎలా పరిష్కరించబడతాయి? కీలక సందర్భాల్లో సైతం ప్రజాభిప్రాయాలు వెల్లడి చేసుకునే అవకాశం లేకపోవడం బాధాకరం. వ్యక్తి ఆరాధన, పార్టీల సొంత ఎజెండా కోసం ప్రజా కాలాన్ని వృధా చేస్తూ నిశిత చర్చలు లేకుండానే చట్టసభలు ముందుకెళ్లడం భావ్యమా! ప్రజాసామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడంతో ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల నమ్మకం తగ్గుతున్నది. దీన్ని నిలబెట్టేలా పాలకులు నిర్దిష్టమైన కాలాన్ని ప్రజల కోసం వెచ్చించాలి. చట్టసభల పనిగంటల్ని పెంచాలి.
మేకిరి దామోదర్‌ 9573666650

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -