ఒకప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్ లభించాలంటే చాలా కష్టపడాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలతో ప్రయివేటు, కార్పొరేట్ విద్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల సంఖ్య తగ్గుతూ వస్తోంది. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు కొదవలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కాలేజీల్లోనే ఈ పరిస్థితి ఉంది. అందులో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వ రంగంలోని హైస్కూల్స్, జడ్పీ స్కూళ్లతో ప్రభుత్వ కళాశాల మధ్య సమన్వయం కూడా తగ్గిపోతోంది. ఈ ప్రభావం కళాశాలల్లో విద్యార్థులు తగ్గడానికి కారణమవుతోంది. దీంతోపాటు చాలామంది విద్యార్థులు క్రమంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ప్రయివేటుకు, కార్పోరేట్కు ఇంటర్ విద్య నెట్టివేయబడిన పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతంలో హైస్కూల్ విద్య వరకు చదివిన విద్యార్థులు, డ్రాపౌట్ అవుతూ ప్రభుత్వ కాలేజీల్లో ఇంటర్ చదవటం లేదు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు వలస వచ్చిన వారు కుటుంబ సామాజిక, ఆర్ధిక పరిస్థితుల కారణంగా, చాలామంది విద్యార్థులు వారి కుటుంబంలో వారు మాత్రమే ప్రభుత్వ ఇంటర్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత వారు ప్రయివేటు కార్పొరేట్ స్కూళ్లవైపు మొగ్గుచూపడం ఎక్కువగా ఉన్నది. దీనికి ఉన్నత విద్యారంగంలో వచ్చిన మార్పులు కూడా ఒక కారణం. నూతన ఆర్థిక విధానాల ప్రభావం కూడా కొంత ప్రభావం చూపింది.
కార్పోరేట్ కళాశాలల ప్రచారం వలన ప్రభుత్వ జూనియర్ కళాశాలల మీద తల్లిదండ్రులకు నమ్మకం సన్నగిల్లుతోంది. దీన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అది చేయకపోవడం వలనే రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాల వారు తమ పిల్లల చదువులకు అప్పులు చేసి అవస్తలు పడుతున్నారు. కార్పొరేట్ మాయలో పడి తమ కుటుంబ వార్షికాదాయంలో అత్యధిక డబ్బు చెల్లిస్తూ నష్టపోతున్నారు. ఈ యాజమాన్యాలకు పాలకులతో అత్యంత సన్నిహిత రాజకీయ సంబంధాలు ఉన్నాయి! ప్రభుత్వ విధానాలు నిర్ణయించే ఈ నేతలు ప్రత్యక్షంగా, పరోక్షంగా కార్పో రేట్, ప్రయివేటు కళాశాలల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యలో ఇంటర్మీడియెట్ ఒక పెద్ద వ్యాపార వస్తువుగా మారిదంటే దానికి కారణం పాలకుల మద్దతే! దీంతోనే తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తం సంపాదించే మార్గంగా కార్పోరేట్ కళాశాలల యాజమాన్యం మారిపో యింది. ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ విద్యార్థులే 99 శాతం మంది చేరుతున్నారు. ఉన్నత వర్గాల వారు చేరటం లేదు. ఇందులో పౌర సమాజం, ప్రజల భాగస్వామ్యం తగ్గుతోంది. రాష్ట్రంలో గత 2024 -25 విద్యా సంవత్సరంలో సుమారు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 9,97,012 పైగా విద్యార్ధులు వివిధ మేనేజ్మెంట్ల నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో మొత్తం సుమారు 3019 (వివిధ మేనేజ్మెంట్ల)లో 424 ప్రభుత్వ జూనియర్ కళాశాలల (ప్రస్తుత విద్యా సంవత్సరంలో 440 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు) సుమారు జనరల్, ఒకేషనల్ ప్రధమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి లక్షా 70 వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. 2024-25 విద్యా సంవత్సరంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం 9,97,012 మంది వార్షిక పరీక్షలకు హాజరయ్యారు.
ప్రభుత్వం విద్యారంగంలో మార్పులు తీసుకురావడం కోసం తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం ఆహ్వానించాల్సిన అంశం. రాష్ట్రంలో సుమారు పదిలక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులతో సంబంధం ఉన్న ఉన్నత విద్యలో కీలకమైన ఇంటర్పై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం మంచి విషయం. అయితే ఇంటర్ విద్యను కార్పోరేట్ శక్తుల నుంచి కాపాడి అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ కళాశాలలను అభివృద్ధి చేయాలని తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్-475 కమిషన్కు పలు సూచనలు చేసింది.అందులో ముఖ్యమైనవి ఏమిటంటే? ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ బోధనలో పటిష్టమైన ప్రణాళికలుండాలి. సమాజ అవసరాలకు అనుగుణంగా నూతన కోర్సులను, సిలబస్ను మార్చాలి. ఒకేషనల్ విద్యలో కొత్త కోర్సులకు ప్రాధాన్యతనివ్వాలి. ఆర్ట్స్ కోర్సులు చదివిన విద్యార్థులకు మంచి భవిష్యత్ అవకాశాలు ఉండే విధంగా సిలబస్ను మార్పుచేసి ప్రణాళికలు రూపొందించాలి. కళాశాలలకు లాభార్జన దృష్టితో కాకుండా దీర్ఘకాల సమాజాభివృద్ధి దృష్టితో చూసి నిధులివ్వాలి. రాష్ట్ర బడ్జెట్లో పదిహేను శాతం నిధులు కేటాయించాలి. విద్యార్థులకిచ్చే స్కాలర్షిప్లు ప్రతినెలా అందించాలి. మధ్యాహ్నం భోజన పథకం కూడా ప్రవేశపెట్టాలి. విద్యార్థినీ విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పించాలి. ఇది లేకపోవడం వలన చాలామంది బాలికలు పదోతరగతి వారి గ్రామంలోనే చదువుకొని, ఆ తర్వాత ఉన్నత చదువులు చదవలేక డ్రాపౌట్ అవుతున్న పరిస్థితి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులకు (కామన్ యూనిఫామ్) ఏకరూపు దుస్తులు పంపిణీ చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు అటెండెన్స్ ప్రతిరోజు వారి తల్లిదండ్రులకు సెల్ ఫోన్కు మెసెజ్ ద్వారా పంపించేటట్లు ఆధునిక పరికరాలు అందచేయాలి. విద్యార్థుల ప్రగతి నివేదన రిపోర్టు (పోగ్రెస్ కార్డు) ప్రతినెలా తల్లిదండ్రులకు ఇవ్వాలి. కళాశాల అధ్యాపకుల్ని ప్రభుత్వ యాజమాన్యంలోని హైస్కూళ్లకు నోడల్ ఆఫీసర్గా కేటాయించాలి. హైస్కూల్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులతో సమన్వయంగా ఉండాలి. విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి హైస్కూల్ కళాశాల మధ్య సమన్వయం పెంచుకుని, వివిధ రకాలైన యాక్టివిటీస్ సంబంధిత జూనియర్ కళాశాల నుంచి పదోతరగతి విద్యార్థులకు పరిచయం చేయాలి.
ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి గురించి అయా నియోజకవర్గం ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మూడునెలలకు ఒకసారి సమీక్షా సమావేశం నిర్వహించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల మానసిక, శారీరక వికాశానికి తరచుగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు నిర్వహించాలి. జిల్లాలో ఇంటర్ విద్యను పర్యవేక్షించడానికి 26 మంది డి.ఐ.ఇ.ఓ. (డిస్ట్రిక్ట్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్) పోస్టులను మంజూరు చేసి వెంటనే భర్తీ చేయాలి.రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సుమారు 36 జూనియర్ కళాశాలలకు ప్రిన్సిపాల్ అండ్ టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల్ని కేటాయించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో తాత్కాలిక లేదా ఔట్ సోర్కింగ్ పద్ధతిలో కాకుండా శాశ్వత ప్రాతిపదికన నియామకాలు ఉండాలి. క్రమబద్ధీకరణ కాకుండా ఆగిపోయిన ఒకేషనల్ కాంట్రాక్స్ లెక్చరర్లను క్రమబద్ధీకరించాలి. గెస్ట్ ఫ్యాకల్టీకి రెమ్యునరేషన్ పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రతి జూనియర్ కళాశాలలో స్వీపర్, స్కావెంజర్ను నియమించాలి. ప్రతి కళా శాలలో విద్యార్ధినీ, విద్యార్ధులకు టాయిలెట్ సౌకర్యం కల్పించాలి. ప్రహరీ, గేటు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఎంసెట్ మొదలగు కోర్సులకు సరైన విధంగా నిర్వహించాలి.ప్రభుత్వ ఇంటర్ విద్య సమూల ప్రక్షాళన జరగాలంటే, విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య పెరగాలంటే ప్రభుత్వం ఈ సూచనల్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
డా|| కొప్పిశెట్టి సురేష్
8074174830