గురుకుల, మధ్యాహ్న భోజనం బకాయిలపై అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఎస్సీ, మైనార్టీ గురుకులాల డైట్, అద్దె బకాయిలు, మధ్యాహ్న భోజనం బకాయిలు రూ.163 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఆర్థిక శాఖ అధికారులు, గురుకులాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లు, ఇతర సంస్థలకు సంబంధించిన డైట్, అద్దె, కాస్మోటిక్స్ బకాయిలకు సంబంధించి రూ.51.36 కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. వాటితోపాటు రాష్ట్రంలోని అన్ని మైనార్టీ గురుకులాలు, మైనార్టీ విద్యాసంస్థలకు సంబంధించిన డైట్, అద్దె బకాయిలు రూ.47.61 కోట్లు విడుదల చేయాలని ఆదేశించామని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి సంబంధించి పెండింగ్లో ఉన్న రూ.63.92 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆదేశించామని వివరించారు.
విద్యార్థులకు నాణ్యమైన, పోషక విలువలతో, వైవిధ్యంతో కూడిన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే గురుకులాలు, వసతి గృహ విద్యార్థుల డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు రూ.200 పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిర్వాహకులు నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దనీ, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ పూర్తిస్థాయిలో పాటించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంస్థల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను సమీక్షించేందుకు అధికారులు నిర్దేశిత క్యాలెండర్ ప్రకారం సందర్శించాలని సూచించారు. అధికారుల సందర్శనకు సంబంధించిన నివేదికలను ఎప్పటికప్పుడు నిర్వాహకులు నివేదించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
రూ.163 కోట్లు విడుదల చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



