నవతెలంగాణ – ఆర్మూర్ : కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఎలాంటి వివాదం లేని శంకర్ పల్లి భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మోకిల పోలీస్ స్టేషన్లలో నమోదు చేసిన అక్రమ కేసుల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డికి సుప్రీం కోర్టులో బుధవారం భారీ ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీచేసింది. అయితే దర్యాప్తుకు సహకరించాలని కోర్టు జీవన్ రెడ్డిని ఆదేశించింది. ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా నమోదైన అక్రమ కేసు అని జీవన్ రెడ్డి తరపు న్యాయవాదులు ముకుల్ రోహిత్గీ, ఎస్ నిరంజన్ రెడ్డి, మహపూజ్ నజకీ ల వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఇదిలావుండగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే బీఆర్ఎస్ లో కీలకంగా ఉన్న జీవన్ రెడ్డిని టార్గెట్ చేసింది. ఎలాంటి తప్పులు చేయకపోయినా జీవన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై వేధింపుల పర్వానికి తెరతీసింది.
కాంగ్రెస్ నేతల వత్తిడి మేరకు ఏ తప్పులు జరగకపోయినా ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి మాల్ ను అధికారులు సీజ్ చేశారు. దీనిపై జీవన్ రెడ్డి చేసిన న్యాయపోరాటం ఫలించి జీవన్ రెడ్డి మాల్ తిరిగి తెర్చుకుంది. అసలు వివాదమే లేని శంకర్ పల్లి భూములకు సంబంధించి కాంగ్రెస్ నేతల ప్రోద్బలంతో ఎవరో ఇచ్చిన తప్పుడు పిర్యాదు మేరకు చేవెళ్ల, మోకిల పోలీసు స్టేషన్లో జీవన్ రెడ్డిపై, ఆయన సతీమణి రజితా రెడ్డి, 70 ఏళ్ల వృద్ధురాలైన జీవన్ రెడ్డి తల్లిపై అక్రమ కేసులు నమోద య్యాయి. ఈ కేసుల్లో జీవన్ రెడ్డి సతీమణికి, తల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయగా ఆయన సుప్రీంకోర్టు నాశ్రయించారు. ఇదిలావుండగా అత్యున్నత న్యాయస్థానం తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ఉద్యమ కాలంలో అప్పటి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రభుత్వం నమోదు చేసిన అక్రమ కేసులు తిరిగి తోడుతుండడమే కాకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తొలి రోజు నుంచే బూటకపు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తనపై 40కేసుల వరకూ అక్రమంగా నమోదు చేసి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి 70 ఏళ్ల వృద్ధురాలైన తన తల్లి ఏం తప్పు చేశారని ఆమెను మానసికంగా హింసిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, బెదిరింపులకు లొంగేదిలేదన్నారు. న్యాయస్థానాలపై తనకు అచంచల మైన విశ్వాసం ఉందన్నారు. తనను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిస్తున్న అక్రమ కేసులపై న్యాయపోరాటం కొనసాగిస్తానని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
సుప్రీంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి ఊరట
- Advertisement -
- Advertisement -