బీజేపీ పరువునష్టం కేసును కొట్టేసిన కర్నాటక హైకోర్టు
బెంగళూరు : పరువు నష్టం కేసులో లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఊరట దక్కింది. 2023 మే ఐదవ తేదీన వార్తాపత్రికలలో ఇచ్చిన ఓ ప్రకటనకు సంబంధించి రాహుల్పై బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసును కర్నాటక హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. అప్పటి అధికార బీజేపీ ప్రభుత్వంపై ‘అవినీతి రేట్ కార్డ్’ పేరిట ఈ ప్రకటన ఇచ్చారు. తనపై నమోదైన పరువు నష్టం కేసును సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం అనుమతించింది.
కర్నాటక పీసీసీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కలిసి బీజేపీని అప్రదిష్టపాలు చేసేందుకు కుట్ర పన్నారని, దానిలో భాగంగానే వార్తాపత్రికలలో ప్రకటన ఇచ్చారని ఫిర్యాదులో ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా అందులో నిరాధారమైన ఆరోపణలు చేశారని తెలిపారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు… నిందితులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ నిందితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.



