అసోం పోలీసుల అరెస్టును నిలిపివేసిన సుప్రీం కోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
ది వైర్ ఎడిటర్ సిద్ధార్థ్ వరదరాజన్, సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్లకు అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభిం చింది. అరెస్టుల నుంచి వారికి రక్షణ కల్పించింది. అసోం పోలీసులు అరెస్టు, ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 152 కింద నమోదు చేసి ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)కు సంబంధించి క్రైమ్ బ్రాంచ్ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ వరదరాజన్, కరణ్ థాపర్ దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోరుమల్య బాగ్చిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది నిత్య రామకృష్ణన్ వాదనలు వినిపిస్తూ ఎఫ్ఐఆర్ మే నెల నాటిదని, మరొక కేసులో సుప్రీంకోర్టు రక్షణ కల్పించిన వెంటనే దీనిని ప్రయోగించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి మొగ్గు చూపుతున్నట్టు కనిపిస్తోందని, దీనివల్ల అరెస్టు జరుగుతుందనే నిజమైన భయం ఏర్పడుతుందని వాదించారు. కేసును పరిశీలించిన తరువాత ధర్మాసనం జర్నలిస్టులకు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. అయితే వారిపై నమోదైన కేసుల దర్యాప్తునకు సహకరించాలని, వారిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని సూచించింది. అనంతరం తదుపరి విచారణను సెప్టెంబర్ 15కి వాయిదా వేసింది. అసోం పోలీసులు నమోదు చేసిన సెక్షన్ 152 ఎఫ్ఐఆర్లో సుప్రీంకోర్టు ది వైర్కు ఉపశమనం ఇచ్చిన కొద్ది రోజులకే అస్సాం పోలీసులు ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం.
సిద్ధార్థ్ వరదరాజన్, కరణ్ థాపర్కు ఊరట
- Advertisement -
- Advertisement -