Wednesday, June 18, 2025
E-PAPER
Homeఆటలుబ్యాటర్లకు ఊరట!

బ్యాటర్లకు ఊరట!

- Advertisement -

– లీడ్స్‌ పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలం
– కలిసిరానున్న వర్షం లేమి పరిస్థితులు
నవతెలంగాణ-లీడ్స్‌

భారత్‌, ఇంగ్లాండ్‌ ఐదు టెస్టుల సిరీస్‌ శుక్రవారం నుంచి ఆరంభం కానుంది. ఇంగ్లీశ్‌ పిచ్‌ స్వభావం, పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో ఇటీవల లార్డ్స్‌లో ముగిసిన ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో చూశాం. టెండూల్కర్‌-అండర్సన్‌ ట్రోఫీలోనూ పిచ్‌లు అదే తరహాలో ఉండనున్నా.. తొలి టెస్టు వేదిక లీడ్స్‌ (హీడింగ్లే) అందుకు మినహాయింపు కానుంది. సహజంగా వేసవి సీజన్‌లో తొలి టెస్టు లీడ్స్‌లో షెడ్యూల్‌ చేయరు. ఐదు మ్యాచుల సిరీస్‌లో మూడో టెస్టుకు (జులై ఆఖరు, ఆగస్టు ఆరంభంలో) లీడ్స్‌ ఆతిథ్యం ఇవ్వటం పరిపాటి. భారత్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌కు అందుకు విరుద్ధంగా తొలి టెస్టునే లీడ్స్‌కు కేటాయించారు. ఈ సమయంలో ఇక్కడ వర్షాలు ఉండవు. అధిక ఉష్ణోగ్రతలు అదనం. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి లీడ్స్‌లో వర్షాలు లేవు. టెస్టు మ్యాచ్‌ సమయంలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు తాకనున్నాయి. ఈ పరిస్థితులు లీడ్స్‌ పిచ్‌ను బ్యాటర్లకు అనుకూలంగా మార్చనున్నాయి. ఇంగ్లాండ్‌ పర్యటనలో ఆశించిన గణాంకాలు లేని భారత బ్యాటర్లకు లీడ్స్‌లో కాసింత ఊరట దక్కనుంది!.
టాస్‌ కీలకం
బ్రెండన్‌ మెక్‌కలమ్‌ ఇంగ్లాండ్‌ చీఫ్‌ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత పిచ్‌ రూపకల్పనలో మార్పులు కనిపిస్తున్నాయి. పరిస్థితులను వంద శాతం సద్వినియోగం చేసుకునేలా జట్టు మేనేజ్‌మెంట్‌ క్యూరేటర్లకు సూచనలు ఇస్తోంది. మెక్‌కలమ్‌ చీఫ్‌ కోచ్‌గా ఉన్న సమయంలో జరిగిన 22 టెస్టుల్లో టాస్‌ నెగ్గిన జట్టు 16 సార్లు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఫీల్డింగ్‌ ఎంచుకున్న జట్లు 9 సార్లు విజయాలు సాధించగా..ఆరింట పరాజయం చెందాయి. టాస్‌ నెగ్గి జట్టు ఆరు సార్లు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకోగా.. ఆరుసార్లు ఓటమే పలకరించింది. లీడ్స్‌లో తొలి రోజు బౌలర్లకు అనుకూలించనుంది. దీంతో టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బంతి అందుకోవటం లాంఛనమే.
భారీ స్కోరుకు చాన్స్‌
లీడ్స్‌లో ఈ సమయంలో పిచ్‌ తయారు చేయటం కొత్త. అందుకే గతంలో పాటించిన పద్దతుల్లో కాకుండా కొత్తగా పిచ్‌ను తయారు చేశారు. అధిక ఉష్ణోగ్రతలు పిచ్‌పై పగుళ్లు వచ్చేలా చేయకపోయినా.. బ్యాటర్లకు పరుగుల వేట సులభతరం కానుంది. ఈ సమయంలో లీడ్స్‌లో జరిగిన టెస్టుల్లో అత్యధిక స్కోరు 360, అత్యల్ప స్కోరు 224. ఇటీవల న్యూజిలాండ్‌పై 296, ఆస్ట్రేలియాపై 251 లక్ష్యాలను ఇంగ్లాండ్‌ నాల్గో ఇన్నింగ్స్‌లో ఛేదించింది. వర్షాభావ పరిస్థితుల్లో జరుగుతున్న టెస్టులో భారీ స్కోర్లు నమోదు కావటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని లీడ్స్‌ పిచ్‌ క్యూరేటర్‌ రిచర్డ్‌ రాబ్‌సన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత్‌ చివరగా 2021లో లీడ్స్‌లో టెస్టు మ్యాచ్‌ ఆడింది. ఆ టెస్టులో ఇన్నింగ్స్‌ తేడాతో టీమ్‌ ఇండియా ఓటమిపాలైంది. అంతకముందు, 2002 టెస్టులో భారత్‌ ఇన్నింగ్స్‌ 46 పరుగుల తేడాతో లీడ్స్‌లో చారిత్రక విజయం నమోదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -