– టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సీ బి.మహేశ్ కుమార్ గౌడ్
– ధర్నాచౌక్లో ఐఎన్టీయూసీ, ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ ధర్నా
నవతెలంగాణ-ముషీరాబాద్
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీజీ పేరును తొలగించడం అన్యాయం అని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్యెల్సీ బి.మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ చట్టం నుంచి గాంధీజీ పేరు తొలగించి, చట్టాన్ని నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ ఐఎన్టీయూసీ, ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్లో భారీ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్డి.చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. ఉపాధి హామీ చట్టం పేరు నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు. గ్రామీణ పేదల జీవనాధారంగా నిలిచిన ఈ చట్టానికి గాంధీజీ పేరు అనుసంధానమై ఉండటం చరిత్రాత్మక అవసరమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు కార్మికులు, రైతులు, పేదల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల హక్కులు, ఉపాధి భద్రత కోసం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డా.జి సంజీవ రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు నుంచి గాంధీజీ పేరును తొలగించడం దుర్మార్గమని అన్నారు. వీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేసేవరకు ఐఎన్టీయూసీ పోరాడుతుందని చెప్పారు. ఉపాధ్యక్షులు, రాష్ట్ర కనీస వేతనాల సలహా బోర్డు చైర్మెన్ బి.జనక్ ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మొగుళ్ల రాజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వై.నాగన్న గౌడ్, భాస్కర్ రెడ్డి, అదిల్ షరీఫ్, ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ నేతలు సిద్ది రాజు, బి.రవి, చల్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
‘ఉపాధి’లో గాంధీ పేరు తొలగింపు అన్యాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



