Sunday, August 3, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ

సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ

- Advertisement -

– కార్పొరేట్‌ స్థాయిలో శాశ్వత భవనాలు
– నాలుగు జిల్లాల్లో 9 ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ భవనాలు
– త్వరలో గచ్చిబౌలిలో భవన శంకుస్దాపనకు ఏర్పాట్లు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఇప్పటికే స్లాట్‌ బుకింగ్‌ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవలందిస్తున్న స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ మరో అడుగు ముందుకేసింది. ప్రజలకు మరింత సమర్థవంతంగా పారదర్శకంగా ఒకే చోట సేవలందించేందుకు వీలుగా సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించడం (రీఆర్గనైజేషన్‌)తో పాటు కార్పొరేట్‌ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించాలని నిర్ణయించింది. ఈ విషయంపై శనివారం హైదరాబాద్‌ లోని డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా, పరిపాలనకు ఇబ్బంది లేకుండా సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ, కొత్త బిల్డింగ్‌ల నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 144 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉండగా అందులో 37 మాత్రమే సొంత భవనంలో ఉన్నాయని మంత్రి తెలిపారు. మిగిలిన వాటికి దశల వారీగా ఆధునిక సౌకర్యాలతో నిర్మించనున్నట్టు తెలిపారు. మొదటి విడతలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో నాలుగు లేదా ఐదు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఒకే చోట ఇంటిగ్రేటెడ్‌ కార్యాలయాన్ని నిర్మించనున్నట్టు చెప్పారు. హైదరాబాద్‌ జిల్లాలో 11 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలకుగాను రెండు చోట్ల, రంగారెడ్డి జిల్లాలో 14కు గాను మూడు చోట్ల, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 12కు గాను మూడు చోట్ల, సంగారెడ్డి, పటాన్‌చెరు కలపి ఒకటి మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో అత్యాధునిక వసతులతో కార్పోరేట్‌ స్ధాయిలో ఇంటిగ్రేటెడ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల భవనాలను నిర్మిస్తామని తెలిపారు. ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ఇందుకు అవసరమైన భూమిని గుర్తించాలని అధికారులను ఆదేశించారు.
ఇంటిగ్రేటెడ్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలతో పనితీరు మెరుగుపడడమే కాకుండా పర్యవేక్షణ కూడా సులభమవుతుందనీ, అవినీతిని కూడా తగ్గించవచ్చనీ, కార్యాలయాల మధ్య పని భారం సమానంగా ఉండడంతో పాటు దస్త్రాల ప్రాసెసింగ్‌ వేగవంతం అవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు. మొదటగా హైదరాబాద్‌లోని గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, బాలానగర్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను, గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్‌ ల్యాండ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (తాలిమ్‌) కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంగా నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ ఇంటిగ్రేటెడ్‌ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయం ఒక రోల్‌ మోడల్‌గా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో చర్చించి ఈ బిల్డింగ్‌ నమూనాకు తుది రూపునిస్తామనీ, వీలైనంత త్వరితగతిన ఈ భవనానికి శంకుస్ధాపన చేసేలా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్‌.లోకేశ్‌ కుమార్‌, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ ఐజీ రాజీవ్‌ గాంధీ హనుమంతు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -