వర్షాకాల సమావేశాల వరకు గడువు
న్యూఢిల్లీ : యూజీసీ స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, 2025పై నివేదిక సమర్పించడానికి వర్షాకాల సమావేశాల చివరి వరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి కేంద్రం గడువు ఇచ్చింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం లోక్సభలో ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్న బీజేపీ ఎంపీ డి.పురందేశ్వరి మాట్లాడుతూ, వచ్చే వర్షాకాల సమావేశాల్లో చివరివారంలోని మొదటి రోజున నివేదికను ప్రవేశపెట్టడానికి వ్యవధి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని లోక్సభ ఆమోదించింది. వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన బిల్లు, 2025ను గతేడాది డిసెంబరు 15న లోక్సభలో ప్రదేశపెట్టారు.
అయితే ఈ బిల్లులో ఉన్న నిబంధనలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. దీంతో ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీ సమగ్రంగా పరిశీలించాలని ప్రతిపాదించారు. నూతన విద్యా విధానం- 2020 ఆధారిత సమగ్ర పర్యవేక్షణలో భాగంగా ఒకే కమిషన్ గొడుగు కిందకు బహుళ ఉన్నత విద్యా నియంత్రణలను తీసుకురావడానికి ఈ బిల్లు ఉద్దేశించబడింది. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల క్రితమే 31మందితో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ నివేదిక వస్తుందని ప్రభుత్వం భావించించింది. కానీ గడువు కావాలని పురందేశ్వరి కోరారు. ఈ కమిటీలో 21 మంది లోక్సభ, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో బీజేపీ నుంచి అత్యధికంగా 12 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి నలుగురు ఉన్నారు.
యూజీసీ స్థానంలోని బిల్లుపై నివేదిక
- Advertisement -
- Advertisement -



