నవతెలంగాణ – పరకాల : పరకాల పట్టణంలోని రెండో వార్డు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం సమర్పించారు. సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానుద్దేశించి పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ.. రెండో వార్డులో వివిధ వీధుల్లో మురికి కాలువలు లేక ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
రెండో వార్డ్ లో గతంలో రెండు సంవత్సరాల క్రితం రోడ్డు కోసం కంకర పోసి రోడ్డు పోయకుండా వదిలేశారని, దానివల్ల కాలనీవాసులు కంకర పై నడవలేక తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారంటు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వీధిలైట్లు పనిచేయకపోవడంతో ప్రజలు చీకట్లోనే ఉంటున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ(ఎం) నాయకుల వినతి మేరకు స్పందించిన కమిషనర్ కడారి సుష్మ రెండో వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్ బొచ్చు ఈశ్వర్ పాల్గొన్నారు.