– దక్షిణ డిస్కం పరిధిలో నేల కూలిన 1,357 స్తంభాలు
– భారీగా ప్రవహిస్తున్న నదుల్లోకి దిగి పనులు చేస్తున్న సిబ్బంది
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలో భారీ వర్షాల ప్రభావంతో పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద కారణంగా పలు సబ్ స్టేషన్లలో నీరు చేరడం, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడం వల్ల పలు గ్రామాల్లో విద్యుత్ పంపిణీ వ్యవస్థ స్తంభించింది. అయితే తమ సిబ్బంది జోరు వాన, భారీ వరదను లెక్కజేయకుండా నదులు ఈదుకుంటూ విద్యుత్ స్తంభాలు ఎక్కి మరీ యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేస్తున్నారని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు. సంస్థ చీఫ్ ఇంజినీర్లు, సూపరింటెండింగ్ ఇంజినీర్లతో గురువారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్లో విద్యుత్ సరఫరా పరిస్థితిని ఆయన సమీక్షించారు.
వర్షం ప్రభావంతో మెదక్ జిల్లాలో విద్యుత్ శాఖకు భారీ స్థాయిలో నష్టం జరిగిందని అధికారులు తెలియజేశారు. మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్ని చోట్ల సబ్ స్టేషన్లలో నీళ్లు చేరాయన్నారు. 33 కేవీ ఫీడర్స్ 11, 11 కేవీ ఫీడర్స్ 175, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 262, విద్యుత్ స్తంభాలు 971 దెబ్బతిన్నాయని, కొన్ని వందల కిలోమీటర్ల మేర విద్యుత్ లైన్ చెడిపోయిందని అధికారులు వివరించారు. మెదక్ జిల్లాతోపాటు నల్లగొండ, గద్వాల్, యాదాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో కూడా నష్టం జరిగిందన్నారు. మొత్తం మీద సంస్థ పరిధిలో వరద ప్రభావానికి 33 కేవీ ఫీడర్స్ 39, 11 కేవీ ఫీడర్స్ 296, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు 280, విద్యుత్ స్తంభాలు 1,357 దెబ్బతిన్నాయని, వరద ఇంకా కొనసాగుతుండటం వల్ల నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని రూరల్ జోన్ చీఫ్ ఇంజినీర్ బాలస్వామి సీఎండీకి తెలియజేశారు.భారీ వర్షాల వేళ, పండుగ పర్వదినాన కూడా మొత్తం విద్యుత్ అధికారులు, సిబ్బంది విధుల్లోనే ఉన్నారని తెలిపారు. భారీ వరద ప్రభావంతో మెదక్ జిల్లాల్లో 15 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా, సిబ్బంది అహర్నిశలూ కృషి చేసి బుధవారం రాత్రి వరకు 10 గ్రామాల్లో సరఫరా పునరుద్ధరించారని అధికారులు తెలిపారు.
భారీ వర్షానికి తోడు రహదారులు కూడా పూర్తిగా దెబ్బతినడంతో మిగిలిన గ్రామాల్లో రాత్రికి సరఫరా పునరుద్ధరించలేకపోయామని, గురువారం తమ సిబ్బంది రాజిపెట్ గ్రామంలో ఉన్న నదిలోకి దిగి ఫీడర్ మరమ్మతు చేసి సరఫరా పునరుద్ధరణ చేశారని అన్నారు. విద్యుత్ సిబ్బంది, అధికారులు మొత్తం అప్రమత్తంగా ఉండి, యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేయడం వల్లే అతి తక్కువ సమయంలో విద్యుత్ సరఫరా అందించగలిగామని, సిబ్బంది పనులు చేసేటప్పుడు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని అధికారులను సీఎండీ ఆదేశించారు.
యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES