Friday, June 27, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరేవంత్‌ రెడ్డి అవినీతి చక్రవర్తి

రేవంత్‌ రెడ్డి అవినీతి చక్రవర్తి

- Advertisement -

తెచ్చిన అప్పులు రూ.2 లక్షల కోట్లలో కమీషన్లు
దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

సీఎం రేవంత్‌ రెడ్డి అవినీతి చక్రవర్తి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిని సమగ్రంగా వివరిస్తూ త్వరలోనే పుస్తకం ప్రచురించి రాష్ట్రమంతా పంచుతామని హెచ్చరించారు. గురువారం హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కేవలం 18 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల అప్పులు తెచ్చి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి రేవంత్‌రెడ్డి కమీషన్లు మెక్కారని ఆమె ఆరోపించారు. కొత్తగా ఒక్క పథకం అమలు చేయకుండా, ఒక్క పింఛన్‌ మంజూరు చేయకుండా, పింఛన్లు పెంచకుండా, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వకుండా తెచ్చిన అప్పులు ఏం చేశారని ప్రశ్నించారు. వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో ఏ గ్రేడ్‌ రేటింగ్‌లో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్‌ రెడ్డి డిఫాల్ట్‌ స్టేట్‌ స్థితికి దిగజార్చారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల కోసం రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ) నుంచి తెచ్చిన లోన్లను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సరైన సమయానికి తిరిగి చెల్లించడం లేదని తెలిపారు. ఇన్‌స్టాల్‌మెంట్ల పేమెంట్‌లో డిఫాల్ట్‌ స్టేజీకి రాష్ట్రాన్ని తీసుకొచ్చారనీ, అందుకు ఆర్‌ఈసీ రాసిన లేఖనే సాక్ష్యమని అన్నారు. కేసీఆర్‌ చేసిన అప్పులు తిరిగి చెల్లించడానికే అప్పులు చేస్తున్నామని చెప్పేవన్ని శుద్ధ అబద్ధాలని ఆర్‌ఈసీ లేఖతో తేలిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌ఈసీకి చెల్లించాల్సిన రూ.1,320 కోట్లను ఈనెల 28వ తేదీలోపు చెల్లించాలని లేఖ రాసిందని గుర్తుచేశారు. సమయానికి చెల్లించకపోతే దివాళాగా పరిగణించాల్సి వస్తుందని కూడా హెచ్చరించిందని చెప్పారు. కేసీఆర్‌ హయాంలో ప్రాజెక్టులు నిర్మించినా ఏ ఒక్క కాంట్రాక్టర్‌కు మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇవ్వలేదనీ, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే మళ్లీ మొబిలైజేషన్‌ అడ్వాన్స్‌ల సంస్కృతి మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం ప్రాజెక్టు కోసం మెఘా ఇంజనీరింగ్‌ సంస్థకు రూ.600 కోట్లు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌కు మరో రూ.600 కోట్ల అడ్వాన్స్‌ ఇచ్చారని తెలిపారు. చెంచా మట్టి కూడా తీయకుండా ఒక్క ప్రాజెక్టుకే రూ.1,200 కోట్ల ముందస్తు చెల్లింపులు చేయడంలో ఆంతర్యమేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
2024 జులై 6న రేవంత్‌ రెడ్డితో సమావేశమైన తర్వాతే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం- బనకచర్ల లింక్‌ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారని కవిత తెలిపారు. 2016లో పోలవరం నుంచి బనకచర్ల లింక్‌ అనే ప్రాజెక్టు ప్రస్తావనే లేదని కొట్టిపారేశారు. రేవంత్‌ రెడ్డి తప్పుడు ప్రచారంతో కేసీఆర్‌పై బురద చల్లాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్ల ప్రాజెక్టుతో ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు లేదని ఆంధ్రా మేధావులు సైతం చెప్తున్నారని వెల్లడించారు. మెఘా ఇంజనీరింగ్‌ సంస్థకు లాభం చేకూర్చడానికే ఈ ప్రాజెక్టు చేపట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు భయపడుతున్న రేవంత్‌రెడ్డి ప్రాజెక్టుపై అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ పెట్టాలని డిమాండ్‌ చేయడం లేదని తప్పుపట్టారు.
పోలవరం ముంపు సమస్యను చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రగతి ఎజెండాలో చేర్చి చివరి నిమిషంలో చర్చను ఎత్తివేసిందని కవిత మండిపడ్డారు. భద్రాచల రాముడు పోలవరంలో మునుగుతున్నా తెలంగాణ నుంచి ఎన్నికైన ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. భద్రాచలం పట్టణాన్ని ఆనుకుని ఉన్న ఐదు గ్రామాలు వెంటనే తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. పూణే మెట్రో రైల్‌కు కేంద్ర కేబినెట్‌లో రూ.3,500 కోట్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారనీ, హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు ఎందుకు నిధులు ఇవ్వలేదని నిలదీశారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకు నిధులు తెచ్చే సత్తా లేదని మండిపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -