Thursday, June 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంహైడ్రాను అడ్డం పెట్టుకుని రేవంత్‌రెడ్డి అండ్‌ కో బ్లాక్‌మెయిల్‌

హైడ్రాను అడ్డం పెట్టుకుని రేవంత్‌రెడ్డి అండ్‌ కో బ్లాక్‌మెయిల్‌

- Advertisement -

– తిరుపతిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకుల ఇండ్లను కూల్చరా..? : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌
– సంస్మరణ సభలో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటికి నివాళులు
– బీఆర్‌ఎస్‌ నేత కుటుంబానికి పరామర్శ
నవతెలంగాణ-జూబ్లీహిల్స్‌

హైడ్రాను అడ్డం పెట్టుకుని రేవంత్‌రెడ్డితో పాటు కాంగ్రెస్‌ నాయకులంతా బ్లాక్‌మెయిల్‌ దందాలు చేస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారక రామారావు ఆరోపించారు. రేవంత్‌రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ నేతలు అక్రమంగా కట్టుకున్న ఏ ఒక్క ఇంటి జోలికీ వెళ్లడానికి సాహసించని హైడ్రా, పేదల ఇండ్ల మీద మాత్రం ప్రతాపం చూపిస్తోందన్నారు. బుధవారం షేక్‌పేట్‌లో జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ సంస్మరణ సభలో కేటీఆర్‌ పాల్గొన్నారు. అనంతరం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీఆర్‌ఎస్‌ బోరబండ డివిజన్‌ మైనార్టీ నాయకుడు మహ్మద్‌ సర్దార్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. యూపీలో బుల్డోజర్‌ రాజ్యం నడుస్తోందని గొంతుచించుకుంటున్న రాహుల్‌ గాంధీకి.. తెలంగాణలో రేవంత్‌రెడ్డి చేస్తున్న అరాచకాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సర్దార్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని స్థానిక కార్పోరేటర్‌ వేధించాడని, అందుకు ఒప్పుకోకపోవడంతో కక్షగట్టి సర్దార్‌ ఇంటిని, షాప్‌ను కూల్చివేయించాడని ఆరోపించారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులను అడ్డం పెట్టుకుని వేధించడం వల్లే తమ నేత సర్దార్‌ ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక.. బీఆర్‌ఎస్‌ నేతలు, పేదలను వేధిస్తున్న కాంగ్రెస్‌ నేతల, అధికారుల హిసాబ్‌ కితాబ్‌ సెటిల్‌ చేస్తామని హెచ్చరించారు. ఇలానే వ్యవహరిస్తే.. తాము రేపు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఒక్క కాంగ్రెస్‌, బీజేపీ నేత కూడా రోడ్డు మీద తిరగలేడని హెచ్చరించారు. సర్దార్‌ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని, అవసరమైతే సుప్రీం కోర్టు వరకు వెళ్తామన్నారు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ లేని లోటును రానివ్వమన్నారు. బీఆర్‌ఎస్‌ క్యాడర్‌కు ఏ కష్టం వచ్చినా ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే మొత్తం పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్సీలు దాసోజు శ్రావణ్‌ కుమార్‌, పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్ధన్‌ రెడ్డి, మైనార్టీ నాయకుడు మహమ్మద్‌ సోయల్‌, మాజీ మంత్రి మహమ్మద్‌ అలీ, కార్పొరేటర్‌లు దేదీప్యరావు, రాజ్‌ కుమార్‌ పటేల్‌, డివిజన్‌ అధ్యక్షుడు విజయ ముదిరాజ్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -