నవతెలంగాణ-హైదరాబాద్ : తెలంగాణలోని నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఏపీపీ(అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి తాజాగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 ఖాళీలు ఉన్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 285 ఏపీపీ పోస్టులు ఉండగా.. వాటిలో 120 మంది మాత్రమే సర్వీసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో కొత్త నియామకాలకు ప్రభుత్వం అనుమతి తెలపడంతో డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ (డీవోపీ) పెద్దమొత్తంలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీ జోన్ 1-50 ఖాళీలు, మల్టీ జోన్ 2-68 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:ఈ పోస్టులకు అభ్యర్థులు లా డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. బార్ కౌన్సిల్ లో ఎన్ రోల్మెంట్ తప్పనిసరి. రాష్ట్రంలోని క్రిమినల్ కోర్టుల్లో కనీసం మూడేళ్ల న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండాలి. వయోపరిమితి జూలై 2025 నాటికి 34 ఏళ్లు మించకూడదు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు సడలింపులు ఉంటాయి. పూర్తి వివరాలకు అధికారిక https://www.tgprb.in/ వెబ్సైట్ను సందర్శించండి.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఉంటుంది. పేపర్ 1, 2 నిర్వహిస్తారు. పేపర్-1 అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్-2 డిస్క్రిప్టివ్ విధానంలో నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా తుది జాబితాను ప్రకటిస్తారు. జీతం నెలకు రూ.54,220 నుంచి రూ.1,33,630 ఉంటుంది. అర్హత ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.