రాణించిన ప్రతీక, రానా
భారత్ 251/10
విశాఖపట్నం : ఐసీసీ మహిళల వన్డే వరల్డ్కప్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో వికెట్ కీపర్, బ్యాటర్ రిచా ఘోష్ (94, 77 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లు) దంచికొట్టింది. 11 ఫోర్లు, 4 సిక్సర్లతో విశ్వరూపం చూపించిన రిచా ఘోష్ 77 బంతుల్లోనే 94 పరుగులు పిండుకుంది. బ్యాటింగ్ లైనప్ మరోసారి కుప్పకూలటంతో భారత్ 102/6తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (9), జెమీమా రొడ్రిగస్ (0), దీప్తి శర్మ (4), ఆమన్జోత్ కౌర్ (13), హర్లీన్ డియోల్ (13) నిరాశపరిచారు. ఓపెనర్లు ప్రతీక రావల్ (37, 56 బంతుల్లో 5 ఫోర్లు), స్మృతీ మంధాన (23, 32 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) తొలి వికెట్కు 55 పరుగులు జోడించి శుభారంభం అందించినా… మిడిల్ ఆర్డర్ పేకమేడలా పతనమైంది.
ఆమన్జోత్ కౌర్తో కలిసి 51 పరుగులు జోడించిన రిచా ఘోష్.. స్నేహ్ రానా (33, 24 బంతుల్లో 6 ఫోర్లు)తో కలిసి డెత్ ఓవర్లతో ధనాధన్ జోరు చూపించింది. 53 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన రిచా ఘోష్.. ఆఖరు ఐదు ఓవర్లలో చెలరేగింది. రిచా ఘోష్ అద్భుత ఇన్నింగ్స్తో మెరువగా.. దక్షిణాఫ్రికాపై తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 251/10 పరుగులు చేసింది. సఫారీ బౌలర్లలో ట్రైయాన్ (3/32), నాన్కుల్లెకో మలబా (2/46), నదినె (2/52), మారిజానె కాప్ (2/45) రాణించారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 25 ఓవర్లలో 91/5తో ఎదురీదుతోంది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి సఫారీ బ్యాటింగ్ లైనప్ను దెబ్బకొట్టారు.