Thursday, June 26, 2025
E-PAPER
Homeఎడిట్ పేజిపెరుగుతున్న సైనిక వ్యయం

పెరుగుతున్న సైనిక వ్యయం

- Advertisement -

ప్రపంచం మొత్తంగానే ఇప్పుడు సైనిక వ్యయం జోరుగా పెరుగుతోంది. ఇందులో యూరప్‌లో పెరుగుదల అన్నింటికన్నా ఎక్కువగా ఉంది. ఏయే ఖర్చులను సైనిక వ్యయంగా పరిగణిస్తారు అన్నదానికి రకరకాల ప్రాతిపదికలు ఉన్నాయి. అందుచేత మనం ఇక్కడ స్టాకహేోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ అంచనాలను మన విశ్లేషణకు ప్రాతిపదికగా తీసుకుంటున్నాం. ఆ సంస్థ నివేదికల ప్రకారం, గత పదేండ్లుగా వరుసగా వాస్తవ సైనిక వ్యయం ఏటికేడాదీ పెరుగుతూనే వస్తోంది. 2024లో ఆ ముందేడాదికన్నా ఏకంగా 9.4 శాతం వ్యయం పెరిగింది. ప్రచ్ఛన్న యుద్ధకాలం ముగిసిన తర్వాత ఏ ఏడాదిలోనూ ఇంత ఎక్కువగా పెరిగినది లేదు. ఇదే అత్యధికం. 2024లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన సైనిక వ్యయం 2.718 లక్షల కోట్ల డాలర్లు (అంటే సుమారు రూ.2,33,74,800 కోట్లు).
ఇంత భారీగా ఖర్చు పెరగడానికి కారణాలేమిటి? మొదటిది: అమెరికాలో హౌసింగ్‌ బుడగ పేలిపోయిన అనంతరం నయా ఉదారవాద ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో పడింది. దానితోబాటు అమెరికా నేతృత్వంలోని సామ్రాజ్య వాద శిబిరం ఆధిపత్యాన్ని సవాలు చేసే శక్తులు పెరుగుతున్నాయి. రెండవది: ఈ సామ్రాజ్యవాద శిబిరపు ఆధిప త్యాన్ని నిలుపుకోవడం కోసం అవసరమైన సైనిక వ్యయంలో ప్రధాన భాగాన్ని ఇన్నాళ్లూ అమెరికా భరించింది. ఇక ఇప్పుడు ఆ మేరకు భరించడానికి అది సిద్ధంగా లేదు. తన యూరోపియన్‌ భాగస్వాములు (బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ వగైరా దేశాలు) ఈ భారాన్ని ఎక్కువగా పంచుకోవాలని అమెరికా కోరుకుంటోంది. సామ్రాజ్యవాద శిబిరం దూకుడుగా సైనిక వ్యయాన్ని పెంచుకుంటూ పోవడం వలన ఆ సామ్రాజ్యవాద ఆధిపత్యాన్ని తట్టుకోవడానికి, నిలవరిం చడానికి తక్కిన దేశాలు కూడా తమ తమ సైనిక వ్యయాలను పెంచుకోడం అనివార్యమవుతోంది.
ఇక్కడ మరికొంత వివరణ అవసరం. 2008 సంక్షోభం తలెత్తక ముందు తమ తమ విదేశీ వ్యాపార చెల్లింపుల్లో పెద్దగా లోటు ఏర్పడని దేశాలు సంక్షోభం బద్దలయ్యాక దిక్కుతోచని స్థితిలో పడ్డాయి. ఆ తర్వాత కోవిడ్‌ మహమ్మారి వ్యాపించడంతో ఆ దేశాల పరిస్థితి మరీ కనాకష్టంగా మారింది. వారి ఎగుమతుల మార్కెట్లు కుదించుకు పోయాయి. ప్రవాసులుగా ఉన్నవారు తమ తమ దేశాలకు ఆదాయాలను పంపడం తగ్గిపోయింది. తమను ఎప్పుడు స్వదేశాలకు తిప్పి పంపేస్తారో అన్న భయం వారిని ఆవహించడం దీనికి కారణం. వారి ద్వారా ఆయా దేశాలకు వచ్చే విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోయింది. ఇలా అన్ని దారులూ మూసుకు పోవడంతో అనేక దేశాలు రుణ సంక్షో భాల్లో చిక్కుకుపోయాయి. అమెరికా నాయకత్వంలో తమపై రుద్దిన నయా ఉదారవాద అంతర్జాతీయ వ్యవస్థ పట్ల రాను రాను ఆ దేశాల భ్రమలు తొలగిపోతున్నాయి. ఇదే సమయంలో చైనా చెప్పుకోదగ్గ రీతిలో అధిక వృద్ధి రేట్లను నమోదు చేస్తోంది. చైనాలో చౌకగా కార్మికశక్తి లభిస్తుందన్న కారణంగా మొదట్లో ఆ దేశానికి తమ పరిశ్రమలను తరలించినది సామ్రాజ్యవాద దేశాలే. ఆ అవకాశాన్ని చైనా బాగా అందిపుచ్చుకుంది. తన విదేశీ వ్యాపారంలో మిగులును బాగా పెంచుకోగలిగింది. ఇబ్బందుల్లో చిక్కుకున్నకొన్ని దేశాలకు కొంత మేరకు తోడ్పాటును అందించ గలుగుతోంది. ఇది సామ్రాజ్యవాద పెత్తనానికి పెద్ద సవాలుగా మారింది. అందుకే చైనాకు వ్యతిరేకంగా సైనికపరంగా జోక్యం చేసుకోడానికి సామ్రాజ్యవాదం తన మిలిటరీ సామర్ధ్యాన్ని పెంచుకోడానికి పూనుకుంది.
సంక్షోభం తలెత్తాక, అమెరికా తన సైనిక వ్యయంలో కొంత భాగాన్ని తక్కిన సామ్రాజ్యవాద మిత్రులపై మోపేందుకు ప్రయత్నిస్తోంది. తన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న సంక్షోభ భారాలను ఏవిధంగా సుంకాల యుద్ధం ద్వారా ఇతర దేశాలపైకి నెట్టివేయడానికి పూనుకుంటోందో అదే విధంగా సైనిక వ్యయం విషయంలో కూడా చేస్తోంది. దీంతో సామ్రాజ్యవాద శిబిరం మొత్తంగానే సైనిక వ్యయం పెరుగుతోంది. గతంలో అమెరికా గొడుగు నీడన తమ సైనిక అవసరాలను తీర్చుకున్న యూరోపియన్‌ దేశాలు ఇప్పుడు స్వంతంగా భారీ సైనిక వ్యయాన్ని చేపట్టవలసివచ్చింది.
రష్యా నుండి దురాక్రమణ జరిగే ప్రమాదం పొంచి వుందన్న సాకును చూపించి ఈ యూరోపియన్‌ దేశాలు తమ సైనిక వ్యయం పెంపును సమర్ధించుకోజూస్తున్నాయి. కాని ఈసాకు చెల్లుబాటు కావడం లేదు. వాస్తవానికి రష్యాపైనే యూరపియన్‌ దేశాలు దురాక్రమణకు తలపడ్డాయి. సోవియట్‌ యూనియన్‌ విచ్ఛిన్నం అయిన సమ యంలో మిఖాయిల్‌ గోర్బచేవ్‌కు క్లింటన్‌ ప్రభుత్వం హామీ స్పష్టంగా ఇచ్చింది. అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి సేనలు రష్యా వైపుగా విస్తరించబోవు అన్నదే ఆ హామీ. కాని దానికి విరుద్ధంగా నాటో సేనల మోహరింపు రష్యా సరిహద్దుల వరకూ జరిగింది. ఉక్రెయిన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన విక్టర్‌ యానుకోవిచ్‌ ప్రభుత్వాన్ని కుట్ర పూరితంగా కూలదోసింది సామ్రాజ్యవాద దేశాలే. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో నాజీలతో చేతులు కలిపిన ద్రోహి స్టెపాన్‌ బండేరాకు అనుచరులుగా వ్యవహరించిన వారిని ఉక్రెయిన్‌లో ప్రభుత్వంలో కూర్చోబెట్టిందీ సామ్రాజ్యవాద దేశాలే. ఆ తర్వాత ఉక్రెయిన్‌లో మైనారిటీలుగా ఉన్న రష్యన్‌ జాతి ప్రజలమీద ఆ ప్రభుత్వం దాడులకు తెగబడింది. నాటోలో సభ్యదేశంగా చేరడానికి దరఖాస్తు చేసింది. ఆవిధంగా రష్యా దేశమే దురాక్రమణ ప్రమాదాన్ని ఎదుర్కోవలసి వచ్చింది తప్ప తాను దురాక్రమణకు పూనుకున్నది లేదు.
2024 లో రష్యా మొత్తం సైనిక వ్యయం 149 బిలియన్ల డాలర్లు. అదే నాటోలో సభ్యదేశాలుగా ఉన్న యూరోపియన్‌ దేశాల సైనిక వ్యయం 454 బిలియన్ల డాలర్లు. అంటే రష్యా సైనిక వ్యయం కన్నా మూడు రెట్లు ఎక్కువ. నిజానికి రష్యా ప్రస్తుతం యుద్ధంలో నిమగమైవుంది. యూరోపియన్‌ దేశాల పరిస్థితి అలా లేదు. కాని రష్యా నుండి ప్రమాదం పొంచి వుందంటూ చెప్పి రష్యా కన్నా మూడు రెట్లు ఎక్కువ సైనిక వ్యయాన్ని చేయడం పచ్చి మోసం. వాస్తవానికి తమ సామ్రాజ్యవాద పెత్తనాన్ని ఎలాఐనా నిలబెట్టుకోవాలన్న కాంక్ష తోటే ఆ దేశాలు తమ సైనిక వ్యయాన్ని పెంచాయి.
ప్రత్యేకించి గతేడాది జర్మనీ తన సైనిక వ్యయాన్ని ఏకంగా 28 శాతం మేరకు పెంచింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ సైనిక బలాన్ని పెంచుకోడానికి వీలు లేకుండా పలు ఆంక్షలను విధించారు. ఆ పరిస్థితి ఇప్పుడ పూర్తిగా మారిపోయింది. 2024 నాటికి యూరప్‌లోనే అత్యధిక సైనక వ్యయం చేసిన దేశంగా జర్మనీ నిలిచింది. అంతే కాక ప్రపంచం మొత్తం మీద అధిక సైనిక వ్యయాన్ని చేసిన దేశాల్లో నాల్గవదిగా జర్మనీ ఉంది. ఇది చాలా పెద్ద మార్పు. జర్మనీకి ఉన్న నాజీ గతం, యుద్ధాలకు కాలు దువ్వే లక్షణం మళ్ళీ తిరగబెట్టి ప్రపంచానికి రాచపుండుగా మారే ప్రమాదం కనిపిస్తోంది. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి.
సామ్రాజ్యవాదం ఈ విధంగా తన సైనిక వ్యయాన్ని గతం కన్నా పెంచడం, భవిష్యత్తులో మరింతగా పెంచనున్నట్టు ప్రకటించడం చూస్తే అసలు ఈ అదనపు వ్యయాన్ని భరించడానికి నిధులు ఏ విధంగా సమీకరిస్తుంది అన్న ప్రశ్న తలెత్తుతుంది. తమ బడ్జెట్లలో ద్రవ్యలోటును కొంతవరకూ పెంచడం అనివార్యంగా జరుగుతుంది. దానితో బాటు ప్రజల సంక్షేమం కోసం చేసే ఖర్చులకు కోత పడడం తప్పదు. వారి దృష్టిలో ఆ కార్పొరేట్లే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించగల శక్తులు కనుక ఆ కార్పొరేట్ల జోలికి ప్రభుత్వాలు పోవు.
తాజాగా ట్రంప్‌ ప్రతిపాదించిన బిల్లు ఇందుకు ఉదాహరణ. దానిని అతగాడు ”పెద్ద, అందమైన బిల్లు” అని పొగిడాడు. అది అమెరికన్‌ కాంగ్రెస్‌ ఆమోదం పొందింది. ఇక సెనేట్‌ ఆమోదం పొందమే తరువాయి. ఆ బిల్లు ప్రకారం రాబోయే పదేళ్లలో కార్పొరేట్లకు 3.76 లక్షల కోట్ల డాలర్ల పన్ను రాయితీలు ఇవ్వనున్నారు. అదే కాలంలో సంక్షేమ పద్దుల్లో 1.3 లక్షల కోట్ల డాలర్ల మేరకు కోతలు పెట్టనున్నారు. వీటితోబాటు ప్రభుత్వ వ్యయం మొత్తం మీద మరో 2.5 లక్షల కోట్ల డాలర్ల మేరకు పెరగనుంది. పన్ను రాయితీల ప్రయోజనాలు సంపన్నులకు దక్కుతా యని, సంక్షేమంలో కోతల వల్ల పేదలే ఎక్కువగా దెబ్బ తింటారని వేరే చెప్పనక్కరలేదు. ఆర్థిక అసమానతలు కూడా తీవ్రంగా పెరుగుతాయి. ముఖ్యంగా వైద్య రంగంలో ప్రభుత్వ వ్యయం తగ్గి,హెల్త్‌ ఇన్సూరెన్స్‌ చార్జీలు పెరగనున్నం దువల్ల పేదలు మరింత దెబ్బతింటారు.
ఈ బిల్లు అమెరికన్‌ కాంగ్రెస్‌ లో ఒకే ఒక్క ఓటు మెజారిటీతో నెగ్గింది. సెనేట్‌లో ఏం జరగబోతోందో స్పష్టంగా తెలియదు. అయితే ఇటువంటి సందర్భాల్లో అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఎలా పావుల్ని కదిపి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోగలుగుతుందో ఊహించవచ్చు. బ్రిటన్‌లో లిజ్‌ ట్రస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టుబడి దారులకు పన్ను రాయితీలివ్వడం కోసం బడ్జెట్‌లో లోటును పెంచడానికి ప్రతిపాదించింది. లబ్ధి పొందబోయేది పెట్టుబడిదారులే అయినప్పటికీ, బడ్జెట్‌ లోటును ఆ విధంగా పెంచడానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి సుతరామూ ఒప్పుకోలేదు. దాంతో బ్రిటిష్‌ పౌండు విలువ విదేశీ మారక మార్కెట్లో పడిపోయింది. ద్రవ్య పెట్టుబడి బ్రిటన్‌ నుంచి తరలిపోయింది. లిజ్‌ ట్రస్‌ వెంటనే రాజీనామా చేయవలసి వచ్చింది. బ్రిటన్‌ చరిత్రలోనే అత్యల్ప కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా ఆమె నిలిచింది. ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి గనుక ట్రంప్‌ బిల్లును ఆమోదించకపోతే, అందులో ప్రతిపాదించిన ద్రవ్య లోటును ఇంకా తగ్గించవలసి వస్తుంది.అప్పుడు సంక్షేమ పద్దుల్లో కోతలు ఇంకా పెరుగుతాయి.
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత కాలంలో సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో సంక్షేమ పద్దుల ఖర్చు పెంచ వలసి వచ్చింది. సోషలిస్టు ప్రపంచం నుండి ఎదురైన సవాలును తట్టుకోడానికి ఈ సంపన్న పెట్టుబడిదారీ దేశాలు తమ పాత వలసలపై అధికారాన్ని వదులుకోవలసి వచ్చింది. దానితోబాటు తమ స్వంత దేశాల్లో దాదాపు పూర్తి స్థాయిలో ఉపాధి కల్పించవలసి వచ్చింది. కార్మికవర్గం పెట్టుబడిదారీ వర్గం నుండి సాధించుకున్న ఈ రాయితీలను ఆ విధంగా చూపకుండా, పెట్టుబడిదారీ వ్యవస్థ స్వభావమే ఏకంగా మారిపోయిందని, ఇప్పుడది సంక్షేమ రాజ్యం అయి పోయిందని, అందుచేత మళ్లీ సోషలిజం వైపు పోవలసిన అవసరం లేదని ఉదారవాద ఆర్థికవేత్తలు ప్రచారం ఎత్తుకున్నారు.
1960, 70 దశకాల్లో ద్రవ్యోల్బణం విజృంభించింది. ఆ తర్వాత చాలా దేశాల్లో నయా ఉదారవాద వ్యవస్థ తలెత్తింది. ఈ సంపన్న దేశాల్లో నిరుద్యోగం మళ్ళీ పెరగసాగింది. ఇప్పుడు నయా ఉదారవాద వ్యవస్థ సంక్షోభంలో పడింది. సామ్రాజ్యవాద పెత్తనమే సవాలును ఎదుర్కొంటోంది. ఈ సవాలును తట్టుకోడానికి సామ్రాజ్యవాదం సైనిక వ్యయాన్ని భారీగా పెంచడానికి తయారైంది. దీని పర్యవసానంగా సంక్షేమ వ్యయం మరింత తగ్గిపోతుంది. ఇటీవల కాలంలో మనం చూడనంత దుర్మార్గంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాల కొల్లగొట్టే దారిదోపిడీ స్వభావం బయట పడుతోంది. ఈ స్వభావం తమ తమస్వంత దేశాల్లోని ప్రజలను కూడా విడిచిపెట్టడం లేదు.
అమెరికా, చైనా, రష్యా, జర్మనీల తర్వాత సైనిక వ్యయంలో ఐదవ అతి పెద్ద దేశంగా భారతదేశం ఉంది. 2024లో 8610 కోట్ల డాలర్ల సైనిక వ్యయాన్ని చేసింది (సుమారు రూ.7,40,000 కోట్లు). ఉపాధి హామీ వంటి పథకాలకు నిధులను నిరాకరిస్తూ సైనిక వ్యయాన్ని మరింతగా పెంచడానికి పూనుకోవడం దాని ఫాసిస్టు లక్షణాన్ని సూచిస్తోంది. అమెరికా, ఇతర సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ట్రంప్‌ నాయకత్వంలో ఏ విధంగా వ్యవహరిస్తు న్నాయో, దానినే మోడీ ప్రభుత్వం అనుసరించడానికి పూనుకుంటోంది. మనం దీనికి వ్యతిరేకంగా పోరాడాలి.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -