Thursday, January 8, 2026
E-PAPER
Homeఖమ్మంపేటలో ఘనంగా రోడ్డు భద్రత మాసోత్సవం 

పేటలో ఘనంగా రోడ్డు భద్రత మాసోత్సవం 

- Advertisement -

– హెల్మెట్ ప్రాధాన్యం పై అవగాహన 
– పోలీస్ ల ఆద్వర్యంలో బైక్ ర్యాలీ
నవతెలంగాణ – అశ్వారావుపేట 

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు – 2026 పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు అశ్వారావుపేట పట్టణంలో మంగళవారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం ఎంత కీలకం మో తెలియజేయడానికి భారీ హెల్మెట్ అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమై, ప్రధాన వీధుల గుండా సాగుతూ భద్రాచలం రోడ్డులోని శ్రీశ్రీ ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న పోలీసులు, యువకులు, వాహనదారులు హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రత నినాదాలతో ప్రజలను చైతన్య పరిచారు. “హెల్మెట్ మీ ప్రాణ రక్షణ”, “ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం – ప్రాణాలు కాపాడుకుందాం, రోడ్డు భద్రత మన బాధ్యత” వంటి నినాదాలు ఆకట్టుకున్నాయి.

ఈ సందర్భంగా అశ్వారావుపేట సీఐ పి. నాగరాజు మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా ప్రాణ నష్టం ద్విచక్ర వాహనదారుల కే జరుగుతోందని తెలిపారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించక పోవడం వల్ల తల గాయాలతో ప్రాణాలు కోల్పోయే ఘటనలు అధికంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తే ప్రమాద సమయంలో తలకి గాయాలు తగ్గి ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని వివరించారు.

ఎస్సై టి. యయాతి రాజు మాట్లాడుతూ.. వాహనదారులు కేవలం హెల్మెట్ మాత్రమే కాకుండా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం,మద్యం సేవించి వాహనం నడపక పోవడం,వేగ నియంత్రణ పాటించడం, సిగ్నల్స్ గౌరవించడం వంటి ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని హెచ్చరించారు.

జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహించనున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ అఖిల, పోలీస్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -