– 8 మంది ఇంజినీరింగ్ అధికారుల క్వార్టర్స్లో చోరీ
– జెన్కో సెక్యూరిటీ అధికారుల నిర్లక్ష్యమేనా?
నవతెలంగాణ-గణపురం
జయశంకర్-భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కేటీపీపీ(కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం)లో సెక్యూరిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల కేటీపీపీ కాలనీలోని 8మంది ఇంజినీరింగ్ అధికారులు ఉంటున్న క్వార్టర్స్లో దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న క్వార్టర్స్లోకి ప్రవేశించి భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో ఈఈ. ఏడీఈ, ఏఈ కేటగిరిల్లో ఇంజినీరింగ్ అధికారులుగా పనిచేస్తున్న వారికి డీ-12, 37, 40, 55, 117, ఈ-6, 56, 79 బ్లాకుల్లో క్వార్టర్స్ను కేటాయించారు. కాగా, ఈ క్వార్టర్స్లో ఉంటున్న టి. తిరుపతిగౌడ్, ఎన్. వంశీధర్, జి. వేణుగోపాల్, ఎ. శ్రీనివాసరావు, ఎఎం రాములు, వనజ, మరో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు.. సోమవారం ఇంటికి తాళాలు వేసి బయటికి వెళ్లారు. ఈక్రమంలోనే దొంగలు తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు, బంగారం దోచుకెళ్లారు. మంగళవారం ఉదయం ఇండ్లకు వచ్చిన అధికారులు తాళాలు తీసి ఉండటంతో దొంగ లు పడ్డారని గమనించి పోలీసులకు సమా చారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనం విషయాన్ని బయటకు తెలియకుండా గోప్యంగా ఉంచుతున్నారు.
కేటీపీపీ కాలనీకి సెక్యూరిటీ లేదా?
కేటీపీపీలో భారీ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి చీమకూడా లోపలికి వెళ్ళదు. అలాంటిది 8మంది ఇంజినీరింగ్ అధికారులు ఉంటున్న క్వార్టర్స్ బ్లాక్లోకి ప్రవేశించి భారీ ఎత్తున బంగారం, నగదు దోచుకెళ్లడం విస్మయానికి గురిచేస్తోంది. కార్మికులు. ఆర్టిజన్స్, ఉద్యోగులు. ఇంజనీరింగ్ అధికారులు లోపలికి వెళ్లాలన్నా.. బయటికి రావాలన్నా.. అణువణువూ చెకింగ్ చేసి పంపిస్తారు. ఉద్యోగుల బూట్లు విప్పి కూడా చెక్ చేస్తారు. అలాంటిది కేటీపీపీలోని క్వార్టర్స్లో దొంగలు పడ్డారంటే అర్థం కాని పరిస్థితి. వారి క్వార్టర్స్కు సెక్యూరిటీని నియమించలేదా? లేక సెక్యూరిటీ నిర్లక్ష్యం వహించారా? అనేది నిర్ధారించాల్సి ఉంది. ఈ విషయమై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
కేటీపీపీ కాలనీలో దొంగల బీభత్సం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES