రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీల ఏర్పాటు
పీఎం వీడియో కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి తెలిపారు. దేశంలో ఇందన సంక్షోభంపై అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు అంశాలను ప్రదాని దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సీఎస్ ఆధ్వర్యంలోని కమిటీ పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోందని తెలిపారు. 33 జిల్లాల్లోనూ గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ విక్రయాల బ్లాక్ మార్కెట్ నిరోధానికి కమిటీలు ఏర్పాటు చేసి నోడల్ అధికారులను నియమించినట్టు తెలిపారు. ప్రాధాన్య క్రమంలో ఆస్పత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను సరఫరా చేస్తున్నట్టు వివిరించారు. స్టాక్, రోజువారి వినియోగంపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణలో సాధారణ రోజుల్లో రోజుకు 36,189 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం జరుగుతుందనీ, ప్రస్తుతం 1,88,210 కిలోలీటర్ల నిల్వలు ఉన్నట్లు సీఎం వివరించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతపై సోషల్ మీడియాలో అపోహలు, భయాందోళనలు కలిగేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్టు సీఎం తెలిపారు. తెలంగాణలో శిలాజ ఇంధనాలపై (బొగ్గు,చమురు,గ్యాస్) ఆధారపడడం తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఈవీలపై వంద శాతం రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయించామన్నారు. ఈవీల తయారీ, బ్యాటరీ ఎకోసిస్టమ్ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్టు సీఎం మోడీ దృష్టికి తీసుకెళ్లారు. హైదరాబాద్ నగరంలో 1.20 లక్షకుపైగా ఉన్న పెట్రోల్, డీజిల్ ఆటోలను రిట్రోఫిట్టింగ్ ద్వారా ఈవీలుగా మార్చే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి ఇతర అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా పెట్రో ఉత్పత్తుల సరఫరా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


