నవతెలంగాణ – వనపర్తి 
వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వసతి గృహ నిర్మాణాలకు హైయ్యర్ ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ .13.15 కోట్లను మంజూరు చేసింది. నియోజకవర్గ ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో జీవో నెంబర్ 169 జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యాపర్తిగా పేరెన్నిక గన్న వనపర్తి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల కు సంబంధించి బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ రూ 13.15 కోట్లు మంజూరు చేసినట్లు మేఘారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన రేవంత్ సర్కార్ ఇప్పటికే విద్యార్థులకు కాస్మెటిక్స్ చార్జీలు పెంచి ఇవ్వడంతో పాటు, ప్రతి విద్యాలయానికి కావలసిన అన్ని రకాల సదుపాయాలను అందిస్తూ వస్తోంది. ఈ క్రమంలో వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల వెనక భాగంలోని వసతి గృహానికి సంబంధించి బాలుర బాలికల నూతన వసతి గృహాల నిర్మాణాలకు నేడు నిధులు మంజూరు  చేసిందన్నారు. ఈ నిధుల మంజూరు కు సహకరించిన ఇంచార్జ్ మంత్రి దామోదర్ రాజనర్సింహకు, జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరికి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవికి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
పాలిటెక్నిక్ వసతి గృహ నిర్మాణాలకు రూ .13.15 కోట్లు మంజూరు
- Advertisement -
- Advertisement -

                                    

