– ఘన్సీమియాగూడలో ఓ ప్రజాప్రతినిధి భూ కబ్జా
– అక్రమంగా నిర్మాణాలు..స్పందించని ఉన్నతాధికారులు
– భూములు కాపాడాలంటున్న స్థానికులు
చట్టాలు చేయాల్సిన పాలకులే ఆ చట్టాలను తుంగలో తొక్కుతున్నారు. పేదలకు దక్కాల్సిన భూములపైనే కన్నేశారు. నిబంధనలను విరుద్ధంగా వందల కోట్ల విలువ చేసే భూములను కొల్లగొడుతున్నారు. రెవెన్యూ అధికారులను తమకు నచ్చినట్టుగా మార్చుకుంటూ ఆ భూములను దక్కించుకుంటున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారమంతా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ఘన్సీమియాగూడలో జరుగుతోంది. సుమారు రూ.150కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిధిలోని ఘన్సీమీయాగూడ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబర్ 4లో సుమారు 360 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని నాటి ప్రభుత్వం కొంత మంది పేద రైతులకు అసైన్డ్ చేసింది. ఈ భూములను క్రయ విక్రయాలు చేయొద్దని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. 2025 ఫిబ్రవరి 18వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టర్..జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్ ఆండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులకు సర్వే నెంబర్ 4లో ఉన్న భూమి ప్రభుత్వానికి సంబంధించినదని, ఎవరికీ రిజిస్ట్రేషన్ చేయొద్దని సూచించారు. ఇలాంటి సమయంలో ఓ వ్యక్తి సుమారుగా 15ఎకరాల స్థలంలో రాజకీయ పలుకుబడితో నిర్మాణాలు చేపట్టారు. సుమారు రూ.150 కోట్ల విలువైన ఈ భూమిని ఓ ప్రజాప్రతినిధి ఏకంగా కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతుంటే ఆపాల్సిన రెవెన్యూ అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒక వైపు కలెక్టర్ ఈ సర్వే నెంబర్లోని భూములను 22(ఎ) కింద చేర్చాలని రెవెన్యూ అధికారులకు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ నిర్మాణాలు మాత్రం కొనసాగడం గమనార్హం.
స్పందించని రెవెన్యూ అధికారులు
ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న విషయంలో రెవెన్యూ అధికారులు స్పందించడం లేదు. సదరు భూము ల్లో నిర్మాణాలు కొనసాగుతున్నా అటు వైపు కూడా చూడటం లేదు. దీనిపై రెవెన్యూ అధికారులను వివరణ కోరగా.. పొంతనలేని సమాధానం చెబుతూ దాటవేస్తున్నారు.
భూములపై పెద్దల కన్ను..
ఘన్సీమియాగూడ హైదరాబాద్కు కూతపెట్టు దూరంలో అంతర్జాతీయ ఎయిర్పోర్టు పక్కనే ఉండటంతో ఈ భూములపై ప్రభుత్వ పెద్దలు కన్నేశారు. ఇక్కడ ఎకరం సుమారు రూ.10 కోట్లు పలుకుతోంది. ఈ భూముల విలువ సుమారు రూ. 4 వేల కోట్లు ఉంటుంది. గత ప్రభుత్వంలో కూడా ఈ భూములను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేశారు. సుమారు 20 ఎకరాలకు సంబంధించి గత ప్రభుత్వంలో సీఎంకు లెఫ్ట్.. రైట్ అనుకున్న ఓ పెద్ద మనిషి ఆ భూమిని రైతు నుంచి కొనుగోలు చేశారని వార్తలు కూడా వచ్చాయి. దీనిపై ప్రస్తుత సీఎం ‘ఈ భూములు పేదలకు చెందాల్సినవి. ఈ భూములను క్రయ విక్రయాలు చేయడానికి వీలులేదు. ఈ భూముల కొనుగోలు చేసిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఆ భూమిలో ప్రతిపక్ష నాయకునిగా రేవంత్రెడ్డి ‘నాగలి’ కట్టి నిరసన తెలిపారు. ఇదే సర్వే నెంబర్లో గోల్డ్స్టోన్ ప్రసాద్ సుమారు రూ.200 ఎకరాలను కబ్జా పెట్టాడు. దీనిపై నాటి ప్రభుత్వం కోర్టులో కేసు కూడా వేసింది. ఆ భూముల్లోకి గోల్డ్స్టోన్ ప్రసాద్ను రాకుండా అడ్డుకుంది. ఈ భూములపై కొంత మంది కోర్టుకు వెళ్లడంతో కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఈ భూముల్లో ఎవరూ అడుగుపెట్టేది లేదని పోలీసులు హుకుం జారీ చేశారు. ఎన్నో ఏండ్లుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులను కూడా ఈ భూముల్లో అడుగుపెట్టనివ్వడం లేదు. కానీ ఓ ప్రజాప్రతినిధి మాత్రం ఆ భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. బహిరంగంగానే ఇంత జరగుతున్నా ఉన్నతాధికారుల మౌనం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఈ భూములను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
రూ. 150కోట్ల భూమి హాంఫట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES